ఏపీలో కూటమి ప్రభుత్వంపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నేత కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా రైతుల ను ఆదుకోవడంలో ఆ ప్రభుత్వం చాలా ముందుందని తెలిపారు. అంతేకాదు.. సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలను ఏదో ఒక విధంగా వాడుకునేందుకు, రైతులకు మేలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం శత విధాలా ప్రయత్నాలుచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడిన ఎల్ నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఇక, ఎన్ని అవాంతరాలు వచ్చినా.. సముద్రంలోకి వృథాగా పోయే జలాలను వాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నం హర్షణీయ మని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతులకు విత్తనాల నుంచి నీటి అవసరాల వరకు కూడా అక్కడి ప్రభుత్వం అన్నింటినీ సమయానికి అందిస్తోందని తెలిపారు. దీంతో ఏపీలో రైతులు సంతోషంగాసాగు పనులు చేసుకుంటున్నారని చెప్పారు. కానీ, అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదని కేటీఆర్ విమర్శించారు. రాజకీయ భేషజాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని చెప్పిన ఆయన.. తెలంగాణలో మాత్రం ప్రాజెక్టుల్లోనూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కారుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల సమస్యలపై అసలు అవగాహనే లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పిన ఆయన.. రెవెన్యూ శాఖ మంత్రిపై ఆరోపణలు చేశారు. ఆయన తన శాఖ నుంచి 30 శాతం వసూళ్లు కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టు అని, కానీ, దీనిని రాజకీయ దురుద్దేశంతో నిలుపుదల చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పోలవరం డయాఫ్రమ్వాల్ కొట్టుకుపోయినప్పుడు ఏమీ కనిపించలేదని, కానీ, మేడిగడ్డ పిల్లర్ కుంగితే మాత్రం ఎక్కడలేని శ్రద్ధ వచ్చిందని ఎద్దేవాచేశారు.
ఢిల్లీకి వెళ్లి ఏం చేశారు?
రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన రేవంత్ రెడ్డి అక్కడ ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. జాతీయ డ్యామ్ భద్రతా అధికారులను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ఇక్కడ ఉండి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని.. అక్కడకువెళ్లాక మాత్రం పెదవి విప్పడం లేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదని వ్యాఖ్యానించారు. `కేసీఆర్ జపం తప్ప.. రేవంత్ ఏం చేస్తున్నారు`` అని ప్రశ్నించారు.