వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గతంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పాత కేసులో కూడా అంబటిని పీటీ వారెంట్ పై పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా సరే అంబటి తీరు మాత్రం మారినట్లు కనిపించడం లేదు. తాజాగా కిర్లంపూడిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన అంబటిపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. కానీ, ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించారు.
అంత్యక్రియల వద్ద పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీంతో, అక్కడ ఉన్న అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఏఆర్ ఎస్సై అప్పలరాజు, తోటి కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలు తమను వెనక్కి నెట్టివేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై BNS 132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.