ఏపీలో అధికారం పంచుకున్న కూటమి పార్టీలు.. టీడీపీ-బీజేపీ-జనసేనలు బుధవారం కీలక భేటీ నిర్వ హించనున్నాయి. ఈ మేరకుటీడీపీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన జారీ చేసింది. కూటమి పార్టీల సమావేశం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో బుధవారం ఉదయం 11గంటల నుంచిప్రారంభం అవుతుందని పేర్కొంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్, జనసేన తరఫున మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ నాగబాబు హాజరుకానున్నారు.
ఎందుకీ సమావేశం..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అయింది. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వ యంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల బరిలో పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
అంతేకాదు.. క్షేత్రస్థాయిలో సమన్వయ కమిటీలను కూడా నియమించనున్నారు. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో జనసేన-టీడీపీ-బీజేపీల మధ్య ఉన్న సమన్వయం.. క్షేత్రస్థాయిలో లేదనే చెప్పాలి. ఎన్ని సార్లు చెప్పినా.. ఎన్ని హెచ్చరికలు చేసినా.. క్షేత్రస్థాయిలో చాలా నియోజకవర్గాల్లో సమన్వయం కనిపించడం లేదు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పైగా.. ప్రస్తుతం వైసీపీ కూడా పుంజుకుంటున్న దరిమిలా.. కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
ఈ క్రమంలో మూడు పార్టీల మధ్య సమన్వయం చేసేందుకు, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలను ముందుండి నడిపించేందుకు పార్టీలు కమిటీలను ఏర్పాటు చేయనున్నాయి. అలానే.. స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మునిసిపాలిటి, కార్పొరేషన్లలో వార్డుల కేటాయింపు, అభ్యర్థుల అంచనా.. గెలుపు వ్యూహాలు, వైసీపీని నిలువరించడం వంటి కీలక విషయాలపైనా ఈ కూటమి సమావేశంలో చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సీనియర్లు చెప్పారు.