దక్షిణాది రాష్ట్రాల్లో మారుతున్న జనాభా సమీకరణాలు, వేగంగా పెరుగుతున్న వృద్ధుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జనాభా సమతుల్యతను కాపాడటంతో పాటు కుటుంబాల ఆర్థిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సరికొత్త ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉండేలా దంపతులను ఉత్తేజపరిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ నూతన విధానంలో భాగంగా, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ఏపీ(AP) సర్కార్ ప్రత్యేక గౌరవాన్ని అందించనుంది. రాబోయే జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని(World Population Day) పురస్కరించుకుని, రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగిన మూడు ఉత్తమ జంటలను ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన ప్రతి జంటకు రూ. 5,000 చొప్పున నగదు పురస్కారాన్ని అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 84 జంటలకు ఈ లబ్ధి చేకూరనుంది. వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో అత్యంత పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ సాగనుంది.
కేవలం సంతానాన్ని పెంచడమే కాకుండా, తల్లి, పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా ఒక కాన్పుకు, మరో కాన్పుకు మధ్య కనీసం రెండేళ్ల కాల వ్యవధిని పాటించిన ఆదర్శ దంపతులకు సైతం బహుమతి లభించనుంది. ప్రతి జిల్లాలో ఇలాంటి 6 జంటలను ఎంపిక చేసి, వారికి కూడా రూ. 5,000 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. ఒకవేళ అర్హులైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటే, లక్కీ డ్రా(Lucky Draw) పద్ధతి ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.
ఈ వినూత్న పథకాలు, జనాభా నియంత్రణ మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కూటమి(AP Govt) ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. పబ్లిసిటీ మరియు ప్రచార కార్యక్రమాల కోసం రూ. 56 లక్షల బడ్జెట్ను విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చైతన్య వారోత్సవాలు జరగనున్నాయి. సమాచార, ఆరోగ్య శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన దంపతులను గుర్తించి ఈ స్కీమ్స్ పై అవగాహన కల్పించనున్నారు.