విజయవాడ కృష్ణలంకకు చెందిన గాడె సాయికృష్ణ అదృశ్యం.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు.. అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం ఆయన నివా సానికి చేరుకున్న సిట్ అధికారులు తొలుత విచారించి.. అనంతరం అదుపులోకి తీసుకుని.. నగరంలోని సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో నాగరాజు అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు.. నిరసన వ్యక్తం చేశారు.
నాగరాజు సిన్సియర్ అధికారి అని.. పేర్కొంటూ నిరసనకారులు సిట్ అధికారులను అడ్డుకునే ప్రయ త్నంచేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం.. పోలీసులు వారిని సముదా యించి నాగరాజును అరెస్టు చేశారు. కాగా..ఎఫ్ ఐఆర్ నమోదై నాలుగు రోజులు గడిచినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అందుకే నాగరాజును అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.
మరోవైపు సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించిన మరింత సమాచారం సేకరిస్తున్నట్టు పోలీసులు చెబు తున్నారు. అతను పోలీసులకు భయపడి మార్కాపురంలో తలదాచుకోగా.. అక్కడకు వెళ్లిన పోలీసులు అతనిని అరెస్టు చేశారని.. ఆ తర్వాత నుంచి ఆయన అదృశ్యమయ్యారని అంటున్నారు. కాగా.. ఈ బృం దం సాయికృష్ణను అరెస్టు చేసి.. ఎక్కడికి తీసుకువెళ్లిందనే కోణంలోనే ప్రస్తుతం విచారణ కొసాగుతోంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం.
నాగరాజే కీలకం!
ఈ మొత్తం వ్యవహారంలో నాగరాజే కీలకమని సిట్ అధికారులు చెబుతున్నారు. ఆయనను విచారించిన తర్వాతే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందన్నారు. కాగా.. సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. వచ్చే సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు తమ విచారణను పుంజుకునేలా చేశారు. ఈ నెల 29నాటికి సాయికృష్ణను తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.