జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇటీవల కాలంలో తన దూకుడు పెంచారు. ఒకవైపు పాలనా పరమైన నిర్ణ యాలు తీసుకుంటూనే.. మరోవైపు రాజకీయంగా కూడా ఆయన అడుగులు జోరుగానే వేస్తున్నారు. గత 6 మాసాల నుంచి పవన్ రాజకీయ అడుగులు గమనిస్తే.. గతానికి, ఇప్పటికీ చాలా తేడా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఆయన మరింత అనుబంధం పెంచుకున్నారు. అలానే.. జాతీయస్థాయిలో జనసేనను పుంజుకునే లా చేయాలన్న వ్యూహంతోనూ ముందుకు సాగుతున్నారు.
కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ సహా.. ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ.. జనసేనను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చేరికల కమిటీలను కూడా నియమించారు. ఇక, జాతీయస్థాయిలో తటస్థులను ఆకర్షించేందుకు సమైక్యత, ఐక్యతలను ఎంచుకున్న విషయం తెలిసిందే. తద్వారా తటస్థులను తనవైపు తిప్పుకోవాలన్నది పవన్ వ్యూహం. అలానే.. యువతను ఆకర్షించాలన్న మరో వ్యూహంతోనూ పవన్ ఢిల్లీ వేదికగా.. ఇటీవల సమావేశం నిర్వహించారు. యువత ఆలోచన చేయాలని.. మంచి వైపు నిర్ణయం తీసుకుని అడుగులు వేయాలని సూచించారు.
ఇక, తెలంగాణలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలానే.. తెలంగాణలో పార్టీ విస్తరణ దిశగా కూడా.. పవన్ కల్యాణ్ ము మ్మరంగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న జనసైన్యాన్ని మరింత పుంజుకునేలా చేసి.. తద్వారా.. పార్టీ పునాదు లను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇలా.. తెలంగాణలో పవన్ వ్యూహాత్మక పంథాను ఎంచుకున్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తూనే.. మరోవైపు ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా మారుతామని చెప్పడం ద్వారా తెలంగాణలో జనసేన సరికొత్త ఒరవడికి పవన్ శ్రీకారం చుట్టే ప్రయత్నం చేశారు.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీగా.. మరోవైపు.. వచ్చే 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న లక్ష్యం తో పవన్ వ్యూహాత్మక పయనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఆరు మాసాల్లో 12 సార్లు పర్యటించారు. సరాసరి నెలకు రెండు సార్లు.. ఆయన కాకినాడ సహా పిఠాపురం(ఒకటి ఎక్కువ కావొచ్చు..తక్కువ కావొచ్చు)లో పర్యటిస్తున్నారు. అదేసమయంలో వైసీపీని కార్నర్ చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా.. ప్రతిపక్షంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కులాలకు అతీతంగా రాజకీయాలు చేయాలన్న ప్రకటన వెనుక కూడా ఇదే వ్యూహం ఉంది.
ఇలా.. వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుల వెనుక.. జనసేన పార్టీ చరిష్మాను తగ్గకుండా చూడడంతోపాటు.. ప్రభుత్వ పరంగా వస్తున్న ఏదైనా వ్యతిరేకత ఉంటే.. దానిని పెద్దగా ప్రభావం చూపని స్థాయికి తగ్గించేలా పవన్ అడుగులు వేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇక, జాతీయస్థాయిలో ప్రస్తుతం నెలకొన్న పొలిటికల్ గ్యాప్ను తనకు అనుకూలంగా మార్చుకుని.. జాతీయంగా కూడా..జనసేనను విస్తరించాలన్న ప్రతిపాదనను కూడా అమలు చేస్తున్నారు.