ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో కాదు, జగన్ కు దమ్ముంటే కాకినాడ రూరల్లో తనపై పోటీ చేయాలని బహిరంగ సవాల్ విసిరారు. ఈ జనసేనాని పవన్ కళ్యాణ్ పై, జనసేన పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే జగన్ పై నానాజీ పరుష పదజాలంతో, బూతులతో విరుచుకుపడ్డారు.
వైసీపీ జైల్లో పుట్టిన పార్టీ అని, జనసేన మాత్రం జనం కోసం, జనం నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. అధికార దుర్వినియోగం, కేసులు, సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీల దృష్టిలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ఏర్పడిందని విమర్శించారు. సామాన్య ప్రజల సమస్యలు, యువత ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి, మహిళల సాధికారత వంటి అంశాలపై పోరాడేందుకు జనసేన పుట్టిందని చెప్పారు.
అయితే, జగన్ ను విమర్శించే స్థాయి నానాజీకి లేదని వైసీపీ నేత వెంకట్ రెడ్డి అన్నారు. దళిత డాక్టర్ ను బహిరంగంగా కొట్టిన నానాజీ కూడా జగన్ ను విమర్శించే వారేనా అని ప్రశ్నించారు. పొత్తులు లేకుండా పవన్ కల్యాణ్, నానాజీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. జగన్ పై నానాజీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.