వైసీపీ హయాంలో అమరావతిని జగన్ నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. రాజధాని విషయంలో జగన్ ఆడిన మూడు ముక్కలాటలో ఘోరంగా ఓడిపోయి ఎన్నికల్లో కూడా పరాజయం పాలయ్యారు. అయితే, 2024లో ఏపీ సీఎంగా చంద్రబాబు, మంత్రిగా లోకేశ్ పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతి ఊపిరి పోసుకుంది. అక్కడి నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే 2028నాటికి అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తవుతుందని, వాటిని ప్రారంభిస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు.
రిపబ్లిక్ టీవీ నిర్వహించిన రిపబ్లిక్ సమ్మిట్ లో పాల్గొన్న లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు కూడా చెప్పిన సమయానికి పూర్తి చేసి తీరతామని తెలిపారు. అమరావతిని ఏపీకి ఎకనమిక్ పవర్ హౌస్ గా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని లోకేశ్ చెప్పారు. తాను మంత్రిగా విద్యాశాఖ, ఐటీ శాఖలను చూస్తున్నానని, అదే సమయంలో ఏపీకి పెట్టుబడుల వేటలోనూ తనవంతు పాత్ర పోషిస్తున్నానని చెప్పారు.