బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతూ గ్లోబల్ రేంజ్లో సంచలనాలు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ఇప్పుడు లీగల్ సమస్యలు చుట్టుముట్టాయి. టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ‘పుష్ప 2’ సినిమా తెచ్చిన క్రేజ్.. ఇప్పుడు బన్నీని కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. హైదరాబాద్లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన విషాద ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టు తాజాగా అల్లు అర్జున్కు షాకిస్తూ సమన్లు జారీ చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
గతేడాది డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో జరిగిన సంఘటన టాలీవుడ్ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ‘పుష్ప 2(Pushpa 2)’ బెనిఫిట్ షో సందర్భంగా బన్నీని చూసేందుకు అభిమానులు థియేటర్ వద్దకు పోటెత్తారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి, తాజాగా కోర్టులో సుదీర్ఘ ఛార్జ్షీట్ను దాఖలు చేశారు.
ఈ కేసులో పోలీసులు మొత్తం 23 మందిని బాధ్యులుగా తేల్చారు. అందులో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1 నుంచి ఏ10 వరకు నిందితులుగా చేర్చిన పోలీసులు.. అనూహ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ను 11వ నిందితుడిగా (A11) పేర్కొన్నారు. ఈ ఛార్జ్షీట్ను పరిశీలించిన నాంపల్లి కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 22న (సోమవారం) విచారణకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. బన్నీతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 19 మందికి కూడా నోటీసులు వెళ్లాయి.
సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అల్లు అర్జున్ పేరు నిందితుల జాబితాలోకి రావడం, పైగా కోర్టు స్వయంగా సమన్లు జారీ చేయడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో పడ్డారు. సోమవారం నాడు ఐకాన్ స్టార్(Icon Star) కోర్టుకు స్వయంగా హాజరవుతారా లేక లాయర్ల ద్వారా తదుపరి చర్యలకు దిగుతారా అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.