రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువతలో సోషల్ మీడియా సంచలనంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. జైపూర్లోని షహీద్ స్మారక్ వద్ద నిరసన ప్రదర్శన జరుగుతుండగా ఈ ఘోరం జరిగింది. ఊహించని విధంగా జరిగిన ఈ దాడికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం, పెరుగుతున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ అభిజీత్ దీప్కే ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న ఒక గుంపు.. నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేసింది.
మాట మాట పెరిగి ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అంతలోనే గుంపులోని ఒకరు ఊహించని విధంగా అభిజీత్ దీప్కేపై చెంపదెబ్బతో విరుచుకుపడ్డారు. లైవ్లోనే చెంప పగలడంతో షాకైన అభిజీత్(Abhijit Dipke).. తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించారు. అయితే, తమ నాయకుడిపై కళ్లెదుటే దాడి జరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సీజేపీ కార్యకర్తలు ఊరుకోలేదు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుని నడిరోడ్డుపైనే చితకబాదారు. దీంతో ఆ ప్రాంతమంతా కాసేపు రణరంగంగా మారింది.
కాగా, అమెరికా(America)లోని ప్రతిష్టాత్మక బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 30 ఏళ్ల అభిజీత్ దీప్కే.. కేవలం నెల రోజుల క్రితమే (మే నెలలో) ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ'ని స్థాపించారు. యువతను ఉద్దేశించి దేశంలోని ఓ ప్రముఖ వ్యక్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యంగ్యాస్త్రంగా పుట్టుకొచ్చిన ఈ 'బొద్దింకల పార్టీ', అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్పై విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఢిల్లీ, పుణె నగరాల్లో సక్సెస్ఫుల్గా నిరసనలు తెలిపిన ఈ టీమ్పై.. ఇప్పుడు జైపూర్ వేదికగా క్షేత్రస్థాయిలో దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
https://x.com/pvramanakumar/status/2066491149095981069