తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్.. మీనాక్షి నటరాజన్ వ్యవహారం.. సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపుతోందా? ఆమెకు సంబంధించిన నామినేషన్ వ్యవహారం తిరస్కరణకు గురికావడం వెనుక సొంత నేతలే చక్రం తిప్పారా? దీనిపై పార్టీ అధిష్టానం `ఆ నేతలు` ఎవరు.. అనే కోణంలో కూపీలాగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్గా ఉన్న మీనాక్షిని పార్టీ అధిష్టానం.. రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ నుంచి ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
మధ్యప్రదేశ్లో మూడు స్థానాలు ఉండగా.. ఒకటి మీనాక్షికి ఇచ్చారు. అయితే.. ఆమె నామినేషన్ దాఖలు చేసిన రోజు `అంతా బాగానే ఉంద`ని ఎన్నికల అధికారులు తెలిపారు. కానీ, రెండు రోజుల్లోనే వారు ఆమె నామినేషన్ను తిరస్కరించారు. దీనికి కారణం.. `మధ్యప్రదేశ్ బీజేపీ` నాయకులు మీనాక్షిపై ఫిర్యాదు చేయడమే. ఆమెపై తెలంగాణలో పోలీసులు కేసులు పెట్టారని.. అది కూడా క్రిమినల్ కేసు అని అక్కడి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో రెండు రోజుల తర్వాత.. మీనాక్షి దాఖలు చేసిన నామినేషన్ను అధికారులు తోసిపుచ్చారు.
సుప్రీంకోర్టు సైతం.. ఈ విషయంలో జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. ఫలితంగా నోటిదాకా వచ్చిన ముద్ద చేజారి పోయి నట్టు అయింది. నిజానికి రాజ్యసభకు మీనాక్షి వెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిసైతం.. ఆమెకు అవకాశం ఇప్పించే విషయంలో దోహదపడ్డారన్న వాదన ఉంది. కానీ.. చివరి నిముషంలో ఇలా జరగడంతో ఇప్పుడు అందరూ షాక్లోనే ఉన్నారు. అయితే.. తెలంగాణలో అది కూడా ఎక్కడో ములుగు జిల్లాలో నమోదైన ఓ కేసు గురించి.. ఎక్కడో ఉన్న బీజేపీ నేతలకు ఎలా తెలిసింది? అనేది ప్రశ్న. దీనికి సొంత నేతలే కారణమన్న వాదన కాంగ్రెస్లో బలంగా వినిపిస్తోంది.
గతంలో ఓ పదవిని ఆశించిన నాయకుడు.. తన అనుచరులతో రాష్ట్ర బీజేపీ నేతల ద్వారా మీనాక్షికి సంబంధించిన సమాచా రాన్ని చేరవేశారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అయితే.. దీనిపై ఆధారాలు సేకరించే పనిలో అధిష్టానం ఉంది. ఇక, వాస్తవం ఏంటంటే.. ములుగు జిల్లాలో జరిగిన ఓ వివాదంలో కాంగ్రెస్ పార్టీ `కీలక`నాయకుడిపై కేసు నమోదైంది. ఇది పార్టీకి సంబంధించిన విషయం కావడంతో స్థానిక అధికారి.. మీనాక్షి పేరును కూడా చేర్చారు. దీంతో స్థానిక కోర్టు.. ఆమెను వివరణ ఇవ్వాలని కోరుతూ.. నోటీసులు జారీ చేసింది. ఇది క్రిమినల్ కేసా.. లేక... నిజంగానే ఎఫ్ ఐఆర్ నమోదైందా? అంటే.. ఏమీలేదు. కానీ.. ఈ విషయంలో స్థానిక కాంగ్రెస్ `పెద్ద నేత` ఒకరు.. బీజేపీకి ఉప్పందించారని చర్చ నడుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ ఈవిషయాన్ని తేల్చే పనిలో పడినట్టు తెలిసింది. మరి ఏం చేస్తారో చూడాలి.