తిరుపతి సభలో ఏపీ మాజీ సీఎం జగన్ పై మంత్రి లోకేశ్ విమర్శలు గుప్పించారు. జగన్ కు క్రెడిట్ చోరీ డిజార్డర్ (CCD) ఉందని లోకేశ్ ఎద్దేవా చేశారు. తాము కష్టపడి Google, Arcelor Mittal వంటి పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చామని, కానీ, వాటిని తానే తెచ్చానని ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కొన్నాళ్లు ఆగితే ఆగస్టు 15న ప్రెస్ మీట్ పెట్టి భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది మా తాతేనని జగన్ చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదని సెటైర్లు వేశారు. జగన్ తెచ్చింది Andhra Gold, President Medal, Gold Medal వంటి కల్తీ, నకిలీ మద్యం బ్రాండ్లు మాత్రమే అంటూ చురకలంటించారు.
జగన్ పేరులో ఉన్న 'జీ' అంటే జెన్-జీ అనుకుంటున్నారని, కానీ, ఆ 'జీ'కి అసలు అర్థం గొడ్డలి అని పంచ్ డైలాగ్ తో విమర్శలు గుప్పించారు. విధ్వంసమే ఆయన ఎజెండా అని, తమది Google అయితే వాళ్లది గొడ్డలి అని, తమది Fighter Jets అయితే వాళ్లది Faction అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని లోకేశ్ అన్నారు. వైసీపీ హయాంలోని దాడులు, జేసీబీలతో కూల్చివేతలు, కబ్జాలు, హత్యలు, బెదిరింపులు పూర్తిగా తగ్గాయని చెప్పారు.
చిన్నప్పుడు 10వ తరగతి పేపర్ లీక్ కేసులో టీచర్లు కొట్టడంతో జగన్ ఉపాధ్యాయులపై కక్ష పెట్టుకున్నారని లోకేశ్ ఆరోపించారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన చరిత్ర జగన్దని విమర్శించారు. మెగా డీఎస్సీని అడ్డుకోవడానికి 226 కేసులు వేసినా, 150 రోజుల్లో 16,347 పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. ఇప్పుడు జగన్ చేస్తున్న డీఎస్సీ విమర్శలు ప్రభుత్వంపై కాదని, నేరుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద, రిజర్వేషన్ల మీద దాడి చేయడమేనని లోకేశ్ స్పష్టం చేశారు.