ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి దేశ రాజధాని వేదికగా వేడెక్కబోతున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు అత్యవసరంగా ఢిల్లీకి పయనం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వచ్చిన పిలుపుతో వీరిద్దరూ హుటాహుటిన ఢిల్లీ వెళ్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. జూన్ 9న ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ (NDA) ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల హైలెవెల్ మీటింగ్లో వీరిద్దరూ భాగస్వామ్యం కానున్నారు.
కేంద్రంలో మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత రెండేళ్ల పాలన, సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాల బలాన్ని చాటడంతో పాటు, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ(PM Modi) దిశా నిర్దేశం చేయనున్నారు.
అయితే, ఈ సమావేశం కేవలం రెండేళ్ల సంబరాలకే పరిమితం కాదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. జూన్ 15వ తేదీ తర్వాత కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు, చేర్పులు (పునర్వ్యవస్థీకరణ) జరిగే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan) ల ఢిల్లీ టూర్కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో అదనపు కోటా దక్కించుకోవడంపై ఈ పర్యటనలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల సాధనే లక్ష్యంగా బాబు-పవన్ ద్వయం ఈ పర్యటనను ఉపయోగించుకోనుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న జోష్.. మరోవైపు కేంద్ర కేబినెట్ విస్తరణ వార్తలతో రేపటి ఢిల్లీ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మోదీతో జరగబోయే ఈ మీటింగ్ తర్వాత ఏపీ(AP) పాలిటిక్స్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూడాలి.