ఏపీలో చిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అమరావతిని వ్యతిరేకించిన వైసీపీ అధినేత జగన్.. తొలిసారి ఈ ప్రాంత రైతులతో ముచ్చటించనున్నారు. నిజానికి ఆయన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కానీ.. గత రెండేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. గతంలో ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కానీ.. రాజధాని రైతులను పలకరించింది లేదు. పన్నెత్తి మాట్లాడింది లేదు. పైగా.. వారిని ఈసడించారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ తన వారితో కామెంట్లు చేయించారు.
రాజధాని అమరావతిని కేవలం శాసనాలకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పిన జగన్.. ప్రకటన అనం తరం ఉవ్వెత్తున ఎగసిపడిన.. రాజధాని ప్రాంత రైతులను ఎన్ని విధాల అవమానించాలో.. అన్ని విధాలా అవమానించారు. అంతేకాదు.. వీరికి పోటీగా.. మూడు రాజధానుల అనుకూల సభలు పెట్టించారు. ధర్నా లు, నిరసనలు, నిరాహార దీక్షా శిబిరాలు కూడా వేయించారు. రాజధాని రైతులపై లాఠీలు ఝళిపించారు. ఇది.. గత ఎన్నికల సమయంలో జగన్కు తీవ్ర స్థాయిలో సెగతగిలేలా చేసింది.
గుంటూరు జిల్లాలో ఒక్క సీటునుకూడా ఆయన గెలుచుకోలేక పోయారు. అయితే.. ఇప్పుడు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జగన్ను రాజధాని ప్రాంత రైతులు కలవనున్నారు. అయితే.. అందరూ కలుస్తారా? సెలక్టెడ్గా కొందరే కలుస్తారా? అనేది చూడాలి. కానీ.. రాజధాని రైతులను ఈసడించిన జగన్ను ఆ రైతులే వచ్చికలుసుకోవడం.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు రావడం వంటివి మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
రీజనేంటి..?
తమకు కౌలు దక్కడం లేదని రైతులు చెబుతున్నారు. అంతేకాదు.. రాజధానికి భూములు ఇవ్వని రైతుల ను అధికారులు ఆగ్రహిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు జగన్ను కలుస్తున్నారు. ఇక్కడ మరో చిత్రం కూడా ఉంది. రాజధాని రైతులను కడు దూరం పెట్టిన జగన్.. ఇప్పుడు వారిని కలుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం. నిజానికి పార్టీ నాయకులకే ఆయన దర్శనం లభించడం లేదు. కానీ.. ఇప్పుడు రైతులకు అప్పాయింట్మెంటు ఇవ్వడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.