ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జూన్ 2(మంగళవారం) హైదరాబాద్లో నిర్వహించాలని భావించిన `తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ- జనసేన సాధక్ సమ్మేళనం` కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఒకవైపు.. అదే రోజు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయని.. దీంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అకాశం ఉందని పేర్కొన్నారు. తమకు అనుమతి ఇవ్వాలని జనసేన నాయకులు పోలీసులను కోరారని.. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో జనసేన కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం లేదని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ మనోభావాలు..
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఏపీలో కేసులు నమోదయ్యాయని.. దీనిపై తెలంగాణ సమాజం ఆగ్రహంతో ఉందని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్.. 2 వేల మందితో ఇక్కడ సభను ఏర్పాటు చేస్తే.. దాని వల్ల శాంతి భద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ``అవును.. వారు కన్వెన్షన్లోనే నిర్వహించినా.. అది శాంతి భద్రతలకు విఘాతం కలుతుందని మా విచారణలో తేలింది`` అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా దీనిని నిర్వహిస్తారని.. దీనివల్ల ఇబ్బందులు వస్తాయని తెలిపారు. పైగా ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
అంతేకాదు.. ఏకంగా ఒకే సారి 2 వేల మందిని తీసుకురావడం వల్ల.. ట్రాఫిక్ ఇబ్బందులతోపాటు వాహనాల పార్కింగుకు కూడా సమస్య వస్తుందన్నారు. సదరు కన్వెన్షన్లో పార్కింగ్ సదుపాయం లేదని యజమాని చెప్పినట్టు డీసీపీ వెల్లడించారు. అందు కే అనుమతి ఇవ్వడం లేదన్నారు. నిబంధనల ప్రకారం అందరూ నడుచుకోవాలని.. సూచించారు. తమకు అంతిమంగా ప్రజల భద్రత, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడడమే ముఖ్యమని డీసీపీ వివరించారు.
కోర్టుకు వెళ్తాం: జనసేన
డీసీపీ ప్రకటన నేపథ్యంలో జనసేన తీవ్రంగా స్పందించింది. తాము నిర్వహించేది సమ్మేళనమని.. సభ కాదని పేర్కొంది. దీనికి అసలు అనుమతి కూడా అవసరం లేదని.. అయినప్పటికీ పోలీసులపై ఉన్న గౌరవంతోనే తాము వారికి సమాచారం ఇచ్చామ ని పేర్కొంది. సభ నిర్వహణకు, సమ్మేళనం నిర్వహణకు తేడా ఉందని తెలిపింది. పోలీసులు ఇచ్చిన ఉత్తర్వులపై.. హైకోర్టును ఆశ్రయించినట్టు దీనిపై జనసేన నేత మహేందర్రెడ్డి తెలిపారు. కోర్టు వారికి అన్నీ వివరిస్తామన్నారు.