తెలంగాణ(Telangana) రాజకీయంలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ వైపు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్, ముఖ్యంగా క్షేత్రస్థాయి నాయకులు మొగ్గు చూపుతున్నారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జనసేన గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ వస్తుండగా, తాజాగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ను నింపాయి.
రాజకీయంగా ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే మల్కాజ్గిరిలో జనసేన(JanaSena) భారీ స్కెచ్ వేసింది. వివిధ పార్టీల్లో అసంతృప్తితో ఉన్నవారితో పాటు, నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు జనసేన వైపు అడుగులు వేశారు. కీలక నాయకురాలు కాజా సుజాత నేతృత్వంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడానికి ముందుకు రావడం విశేషం. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆయన రాజకీయ ప్రస్థానం నచ్చే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు.
మల్కాజ్గిరి(Malkajgiri) వేదికగా జరిగిన ఈ భారీ చేరికల కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకుడు శ్రీ రామ్ తాళ్లూరి కీలక పాత్ర పోషించారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ, జనసేన కండువా కప్పి పార్టీలోకి వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో జనసేన కేవలం ఒక పార్టీ మాత్రమే కాదు, ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక పార్టీలో చేరిన నేతలు, ఉద్యమకారులు సైతం పూర్తి ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీలోనూ దక్కని గుర్తింపు, గౌరవం జనసేనలో లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం చేరికలతోనే ఆగిపోకుండా.. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ప్రతి గల్లీలోనూ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సిద్ధాంతాలను తీసుకెళ్తామని, రాబోయే రోజుల్లో జనసేనను తిరుగులేని శక్తిగా మారుస్తామని వారు శపథం చేశారు. ఈ పరిణామాలతో మల్కాజ్గిరి రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.