ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ ఆర్టీ అగ్ర నేత నాదెండ్ల మనోహర్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. పవన్, మనోహర్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అడిగారని, అందుకాయన స్పందిస్తూ జగన్ తమకు శాశ్వత మిత్రుడని చెప్పి వీరి విజ్ఞప్తిని తిరస్కరించారని నాగేశ్వర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. ఏమాత్రం ఆధారం లేకుండా నాగేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఊహించని ఈ వ్యతిరేకత చూశాక నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయినా సరే శాంతించని జనసైనికులు నాగేశ్వర్ మీద ఏపీలో పలు చోట్ల కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం కొన్ని రోజుల తర్వాత కూడా సద్దుమణగలేదు.
తాజాగా పవన్ కళ్యాణ్ సైతం నాగేశ్వర్ వ్యాఖ్యల మీద స్పందించారు. నాగేశ్వర్ మీద తనకు ఎంతో గౌరవం ఉందంటూనే, అలాంటి వ్యక్తి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడమేంటి అని పవన్ ప్రశ్నించారు. తాను తన గురించి ఏం మాట్లాడినా పట్టించుకోనని, ఎన్నో సార్లు వైసీపీ వాళ్లు వ్యక్తిక్త హననం చేసినా వదిలేశానని.. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత పవర్ ఫుల్ హోం మినిస్టర్ అయిన అమిత్ షా గురించి ఇలా మాట్లాడ్డంతో చాలా బాధేసిందని, బీజేపీ వాళ్లను మించి తాను బాధ పడ్డానని పవన్ చెప్పారు. ప్రధానిని, హోం మంత్రిని కలిస్తే మాట్లాడ్డానికి విషయాలే ఉండవా, ఫలానా నాయకుడిని అరెస్ట్ చేయండి అని అడుగుతామా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లినపుడు దేశం గురించి, రాష్ట్రం గురంచి, ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం తప్ప, ఇలాంటి విషయాలు చర్చకు రావని పవన్ అన్నారు. ఒక పార్టీ నాయకుడిని అరెస్ట్ చేస్తే తమ పార్టీ బలపడుతుందనుకునే దిగజరారుడు ఆలోచన తమది కాదని.. ఈ నాయకులు లేనపుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే తెగించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని తానని.. అలాంటి తన గురించి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారని పవన్ అన్నారు. తప్పు చేసిన వ్యక్తిని జైలుకు పంపించడం లాంటి విషయాలు వాళ్లు చూసుకుంటారని, వాళ్లకు అన్నీ తెలుసని పవన్ వ్యాఖ్యానించారు ఆయనను అరెస్టు చేయవద్దని ఈరోజు కూడా చెప్పానని అన్నారు..