జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ రూట్ మార్చారు. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క అనే రేంజ్లో ఆయన తన సొంత పార్టీ నేతలకే స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపారు. ముఖ్యంగా పార్టీ ముసుగులో ఉంటూ.. లోపల జరిగే విషయాలను బయటకు చేరవేసే కోవర్టుల ఆట కట్టించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాజమహేంద్రవరం వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా జనసేన శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వంలో జనసేన(Janasena) కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో.. పార్టీలో పదవుల పంపకాలపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందరికీ ఒకేసారి పదవులు రావడం సాధ్యం కాదనే కనీస అవగాహన లేకుండా.. పదవులు దక్కిన తోటి నేతలపై కొందరు అసూయ పెంచుకుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారని, ప్రత్యర్థులతో చేతులు కలిపి సొంత పార్టీకే నష్టం చేకూరుస్తున్నారనేది పవన్ మాటల అంతరార్థం.
చాలామంది రాజకీయ నాయకులు మీడియాలో వచ్చే వార్తలను చూసి లైట్ తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రూటే సెపరేట్. ప్రతి మీడియా హౌస్లోనూ, టీవీ ఛానళ్లలోనూ తనకు నమ్మకమైన వ్యక్తులు ఉన్నారని పవన్ బాంబ్ పేల్చారు. పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్లాంట్ చేస్తున్నది ఎవరు? లోపలి విషయాలను లీక్ చేస్తున్నది ఎవరు? అనే పూర్తి సమాచారం తన దగ్గర ఉందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. తనకున్న నెట్వర్క్ ద్వారా ఎప్పటికప్పుడు నిక్కచ్చిగా సమాచారం అందుతోందని, తప్పు చేసేవారు ఎంతటి వారైనా తప్పించుకోలేరని తేల్చి చెప్పారు.
``దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. నా సహనాన్ని పరీక్షించవద్దు. లీకు వీరుల జాతకాలు నా దగ్గర ఉన్నాయి. పరిధి దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.`` అంటూ పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇప్పటివరకు జనసేనాని అందరినీ ఒకేలా చూశారు, ఎంతో ఓపికగా భరించారు. కానీ, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే మాత్రం ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం(Deputy CM)గా ప్రభుత్వ బాధ్యతలతో పాటు, పార్టీ క్రమశిక్షణ విషయంలోనూ కఠినంగా ఉంటానని ఈ సమావేశం ద్వారా పవన్ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ మాస్ వార్నింగ్తో జనసేనలోని కోవర్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.