జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం జనసేనకు తలనొప్పులు తెచ్చిన సంగతి తెలిసిందే. శ్రీధర్ పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి చేసిన ఆరోపణల నేపథ్యంలో శ్రీధర్ పై జనసేన విచారణ కమిటీ కూడా వేసింది. ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగినా జనసేనకు బాగా డ్యామేజీ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్ సంచలన ప్రకటన చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఈ రోజు అరవ శ్రీధర్ భేటీ అయ్యారు. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలపై శ్రీధర్ వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. అయితే, వ్యక్తిగత కారణాలతోనే తాను విప్ నకు రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పవన్ కు ఆయన అందజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. మరి, ఆ రాజీనామాను పవన్ ఆమోదిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.