జనం సొమ్ము రూపాయి కూడా సైబర్ నేరస్తులకు చిక్క కూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం సైబర్ నేరాల్లో దేశం ముందుందన్న విషయం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఈ క్రమంలో ఏపీలో కూడా ఇటీవల కాలంలో సైబర్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. వీటిని అడ్డుకునేం దుకు పోలీసులు, బ్యాంకర్లు సంయుక్తంగా కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
సైబర్ నేరాల్లో తక్షణ స్పందన-ఏపీలో నియంత్రణా వ్యవస్థపై అమరావతిలోని సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై సమావేశం లో చర్చించారు. ఇతరుల బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సైబర్, ఆర్ధిక నేరాలకు సంబంధించి బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబరుకు 9.29 లక్షల కాల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్(పెట్టుబడుల మోసాలు) అతిపెద్ద ఆర్ధిక నేరంగా మారిందని చంద్రబాబు వివరించారు. ఏపీలో ఇప్పటి వరకూ సైబర్, ఆర్ధిక నేరాల్లో రూ.652 కోట్ల మేర కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం- బ్యాంకర్లతో కలిసి రూ.116 కోట్ల పైచిలుకు మొత్తాన్ని సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడగలిగామని అధికారులు స్పష్టం చేశారు. పిషింగ్, విషింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు, ఆన్ లైన్ లోన్ ఫ్రాడ్స్ సహా డిజిటల్ అరెస్టుల్లో బాధితులు సొమ్మును కోల్పోతున్నట్టు అధికారులు వెల్లడించారు.
సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పని చేస్తోందని అధికారులు వివరించారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలలో సైబర్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలిపా రు. అయితే.. ప్రజల కష్టార్జితాన్ని రూపాయి కూడా సైబర్ నేరస్తులకు చిక్కకుండా చూడాలని.. ఈ క్రమంలో ఏం చేయాలో ఆలోచించి తగిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సైబర్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాలని చంద్రబాబు ఆదేశించారు.