తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక పండుగ 'మహానాడు(Mahanadu)' వేడుకల్లో ఈసారి ఒక ఊహించని మార్పు చోటుచేసుకుంది. ప్రతి ఏటా మూడు రోజుల పాటు అట్టహాసంగా సాగే ఈ రాజకీయ పండగను, ఈ విడత కేవలం రెండు రోజులకే పరిమితం చేయాలని పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పసుపు పండుగ వ్యవధిని తగ్గించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఈ హఠాత్ నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ప్రస్తుతం దేశాన్ని వేధిస్తున్న ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు, వనరులను పొదుపుగా వాడుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) దేశప్రజలకు, రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. ప్రధాని ఇచ్చిన ఈ పిలుపునకు టీడీపీ సానుకూలంగా స్పందించింది. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా దేశ హితం కోసం తాము కూడా పొదుపు చర్యలు పాటించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మహానాడును రెండు రోజులకు కుదించినట్లు తెలుస్తోంది.
ఈసారి మహానాడు వేడుకలకు నెల్లూరు జిల్లా(Nellore District) వేదిక కానుంది. కోవూరు నియోజకవర్గ పరిధిలోని కొడవలూరు సమీపంలో మే 27, 28 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేవలం రెండు రోజులే అయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చలు జరిపేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒక రోజు తగ్గినా.. వేడుకల జోష్లో మాత్రం ఎలాంటి తగ్గేదేలే అన్నట్టుగా తమ్ముళ్లు ఏర్పాట్లలో మునిగిపోయారు.