ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండే తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ‘మహానాడు’(Mahanadu) నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తోంది. నెల్లూరు వేదికగా పసుపు దండు కదం తొక్కేందుకు రెడీ అవుతుండటంతో తమ్ముళ్లలో ఎక్కడ లేని జోష్ కనిపిస్తోంది. ఇటీవలే జాతీయ, రాష్ట్ర కమిటీలను కూడా ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేశాయి. అయితే, సరిగ్గా ఇదే తరుణంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రూటు మార్చింది. టీడీపీ హడావుడికి బ్రేక్ వేస్తూ.. తామేంటో చూపించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక భారీ వ్యూహానికి తెరలేపినట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది.
నిజానికి వైసీపీ పవర్ కోల్పోయి రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు క్యాడర్లో జోష్ నింపేలా ఒక పెద్ద బహిరంగ సభ గానీ, స్టేట్ లెవెల్ మీటింగ్ గానీ జరగలేదు. జగన్(Jagan) అప్పుడప్పుడు జిల్లాల పర్యటనలు చేస్తున్నప్పటికీ, అది పార్టీ మైలేజీకి పెద్దగా ప్లస్ అవ్వలేదనే చర్చ నడుస్తోంది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ.. త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ చాలా సీరియస్గా తీసుకుంటోంది. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజల్లోకి వెళ్లకపోతే భారీ నష్టం తప్పదని భావించిన జగన్.. ఈసారి సరికొత్త పొలిటికల్ గేమ్కు శ్రీకారం చుడుతున్నారట.
టీడీపీ(TDP) ప్రతి ఏటా నిర్వహించే ‘మహానాడు’ తరహాలోనే.. వైసీపీ కూడా త్వరలోనే ఒక భారీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ లేదా భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తోందని సమాచారం. ప్రస్తుతం పార్టీలో బూత్ లెవెల్ కమిటీల నియామకం శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, ఏపీ రాజకీయాల్లో బిగ్ సౌండ్ వచ్చేలా ఒకే ఒక్క మీటింగ్తో సీన్ మార్చేయాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ సభ వేదికగానే రాబోయే ఎన్నికలకు సమరశంఖం పూరించడంతో పాటు, క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపాలని భావిస్తున్నారు.
అంతేకాదు, ఈ మీటింగ్ సక్సెస్ అయిన వెంటనే జగన్ జిల్లాల పర్యటనల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించనున్నారట. ఆ తర్వాత నేరుగా ప్రజల్లోనే ఉండేలా మరోసారి పాదయాత్రకు కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికార పక్షం టీడీపీ ఒక అడుగు ముందే ఉన్నప్పటికీ.. కాస్త ఆలస్యంగా మేల్కొన్న వైసీపీ(YCP), ఈసారి పక్కా స్కెచ్తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది.