సౌత్ ఇండియన్ టాప్ స్టార్లలో సూర్య ఒకడు. ఈ మధ్య సరైన విజయాలు లేక కొంచెం డౌన్ అయ్యాడు కానీ.. సరైన సినిమా పడితే అతడి సినిమా లెక్కలే వేరుగా ఉంటాయి. పేరుకు తమిళ నటుడే కానీ.. సౌత్ ఇండియా అంతటా అతడికి మంచి మార్కెట్ ఉంది. ఏపీ-తెలంగాణల్లో లోకల్ హీరోలా చూస్తారతడిని. కేరళ, కర్ణాటకల్లోనూ సూర్య ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఇలాంటి సూపర్ స్టార్ ఒక మాస్ సినిమా చేశాడంటే.. అతడికి ఎదురుగా ఒక పవర్ ఫుల్ విలన్ ఉండాలని ఆశిస్తారు అభిమానులు. ఆ పాత్రను ఒక పెద్ద నటుడే చేయాలని, తనకో స్టేచర్ ఉండాలని కోరుకుంటారు.
కానీ సూర్య కొత్త సినిమా ‘వీరభద్రుడు’లో మాత్రం ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీనే మెయిన్ విలన్ రోల్ వేసేయడం అందరికీ పెద్ద షాకే. ముఖ్యంగా సూర్య అభిమానులు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. వేరే సినిమా అంటే ఏమో కానీ.. ఇలాంటి మాస్ సినిమాలో బాలాజీని విలన్కు ఊహించుకోవడం కష్టంగా ఉంది.
ట్రైలర్లో ముందు బాలాజీని నెగెటివ్ పాత్రలో పరిచయం చేయగా.. ముందుకు వెళ్లాక పెద్ద రేంజ్ ఉన్న వేరే విలన్ రంగప్రవేశం చేస్తాడేమో అని చివరి వరకు చూసి నిరాశ చెందారు ఫ్యాన్స్. బాలాజీ ఇప్పటి వరకు చాలా వరకు కామెడీ రోల్సే చేశాడు.
తనను చూస్తే నవ్వొస్తుంది కానీ.. భయం కలగదు. ఈ పాత్ర చాలా స్పెషల్గా ఉంటుందని, సినిమా చూశాక అందరూ తాను ఆ పాత్ర చేయడం కరెక్ట్ అని కన్విన్స్ అవుతారని బాలాజీ ధీమాగా చెబుతున్నాడు కానీ.. ఇప్పటికైనా ఫీడ్ బ్యాక్ నెగెటివ్గానే ఉంది. బాలాజీ విలన్ పాత్ర చేయడం ద్వారా సినిమా రేంజ్ తగ్గిపోయిందని.. తెరపై ఆ పాత్ర చాలా టిపికల్గా ఉండి, బాలాజీ బాగా పెర్ఫామ్ చేస్తే తప్ప ఇది మైనస్ అవుతుందనే అభిప్రాయంతోనే ఉన్నారు సూర్య అభిమానులు. మరి వారి అభిప్రాయాన్ని బాలాజీ తప్పని రుజువు చేస్తాడేమో చూడాలి. తమిళంలో ‘కరుప్పు’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సూర్య సరసన త్రిష కథానాయికగా నటించింది.