ఇండియన్ సినిమాలో సీక్వెల్ సంస్కృతి పెరుగుతున్నా సరే.. ఇందులో సక్సెస్ రేట్ తక్కువే. హాలీవుడ్లో మాదిరి ఒక ఫ్రాంఛైజీలో అయిదారు సినిమాలు తీయడం ఇక్కడ అరుదు. బాలీవుడ్తో పోలిస్తే దక్షిణాదిన సీక్వెల్ కల్చర్ తక్కువే. గతంతో పోలిస్తే ఇక్కడ పార్ట్-2, 3లు తీయడం పెరిగినా.. గరిష్టంగా మూడో సినిమా తీస్తారు తప్ప, అంతకుమించి ముందుకు వెళ్లడం అరుదు.
సౌత్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీ అయిన దృశ్యం(Drishyam)లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అవి రెండూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మోహన్ లాల్, జీతు జోసెఫ్ జోడీ మూడో సినిమాతో రెడీ అయింది. ఈ నెల 21నే దృశ్యం-3(Drishyam 3) విడుదల కాబోతోంది. శనివారమే దీని ట్రైలర్ లాంచ్ చేశారు. అది ఓకే అనిపించింది. దృశ్యం, దృశ్యం-2లతో పోలిస్తే ఇందులో అంత థ్రిల్ ఉండదేమో అనిపిస్తోంది. దర్శకుడు కూడా ఎక్కువ థ్రిల్స్ ఆశించొద్దనే చెబుతున్నాడు. ఈ సినిమాతో దృశ్యం ఫ్రాంఛైజీకి తెరపడుతుందనే ఎక్కువమంది అంచనా వేస్తున్నారు.
కానీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా హీరో మోహన్ లాల్(mohan lal) దృశ్యం-4, దృశ్యం-5 గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దృశ్యం ఫ్రాంఛైజీల్లో తొలి రెండు చిత్రాల్లాగే మూడోది కూడా ఘనవిజయం సాధించాలని ఆశిస్తున్నట్లు చెప్పిన మోహన్ లాల్.. దృశ్యం-4 కూడా రావాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు తెలిపాడు. నిర్మాత ఆంటోనీ పెరువంబూర్ అయితే దృశ్యం-5 కూడా తీయాలని ఆశపడుతున్నట్లు మోహన్ లాల్ వెల్లడించాడు.
ఐతే తమ కోరిక ఫలించడం ప్రేక్షకుల చేతుల్లో ఉందని.. వాళ్లే తర్వాతి భాగాలు రావాలా వద్దా అన్నది నిర్ణయిస్తారని మోహన్ లాల్ అన్నాడు. తద్వారా ఈ సినిమాను హిట్ చేస్తే ఇంకో సీక్వెల్ ఆశించవచ్చని చెప్పకనే చెప్పేశాడు మోహన్ లాల్. మరి సినిమాలో అంత బలమైన కంటెంట్ ఉంటుందా.. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం మంచి ఫలితాన్ని అందుకుంటుందా.. మోహన్ లాల్ కోరిక నెరవేరుతుందా అన్నది ఈ నెల 21న తేలుతుంది. ఏప్రిల్ 2నే రావాల్సిన ఈ చిత్రాన్ని గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు బాలేనందున ఏప్రిల్ 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.