భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది ఒక సెంటిమెంట్. పుట్టినరోజు నుంచి పెళ్లిళ్ల వరకు పసిడి లేనిదే ఏ శుభకార్యమూ పూర్తికాదు. అయితే, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అసలు పసిడి కొనుగోళ్లకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఉన్న లింక్ ఏంటి? ప్రధాని అంతటి వారు ఎందుకు ఇలాంటి అభ్యర్థన చేయాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.
భారతదేశం తన అవసరాలకు కావాల్సిన ముడి చమురు (Crude Oil), బంగారాన్ని అత్యధికంగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ కొనుగోళ్లన్నీ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ల రూపంలోనే జరుగుతాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాల వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు ధర పెరిగిన ప్రతిసారీ మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతుంటాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలు విపరీతంగా బంగారం కొంటే, మరిన్ని డాలర్లు దేశం దాటి బయటకు వెళ్తాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దిగజారి, దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే, మన ఎగుమతుల కంటే దిగుమతులు మితిమీరినప్పుడు 'కరెంట్ అకౌంట్ డెఫిసిట్' (CAD) ఏర్పడుతుంది. చమురు అనేది తప్పనిసరి అవసరం, కానీ బంగారం అనేది ఒక రకమైన పొదుపు లేదా విలాసం మాత్రమే. అందుకే అత్యవసరం కాని బంగారంపై ఖర్చును తగ్గించుకుంటే, ఆ నిధులను చమురు దిగుమతులకు మళ్లించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రూపాయి బలహీనపడకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రూపాయి విలువ పడిపోతే కేవలం బంగారం ధరలు(Gole Prices) మాత్రమే కాదు.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. ఇంధన ధరలు పెరిగితే రవాణా భారమై నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది చివరకు సామాన్యుడి జేబుకే చిల్లు పెడుతుంది. ఈ ద్రవ్యోల్బణ చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికే, ఒక ఏడాది పాటు పసిడి కొనుగోళ్లకు దూరంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక సుస్థిరత కోసం ప్రజలు తమ బంగారు అలవాటును కాస్త వాయిదా వేసుకోవాలన్నదే ఈ విజ్ఞప్తి వెనుక ఉన్న అసలు పరమార్థం. మరి ప్రధాని పిలుపుకు భారతీయులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి!