పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఓట్ల చోరీ జరిగిందని, సీఈసీతోపాటు బీజేపీపై దీదీ నిప్పులు చెరిగారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. దీంతో, ఆమెపై పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ సీఎం అభ్యర్థులలో ఒకరైన సువేందు అధికారి ఆ కామెంట్లపై స్పందించారు. ఓటమిని అంగీకరించి దీదీ హుందాగా రాజీనామా చేయాలని, సచివాలయం ఖాళీ చేయాలని అన్నారు. మరోవైపు, దీదీ రాజీనామా చేయకున్నా సరే గవర్నర్ తనకున్న విచక్షణాధికాన్ని ఉపయోగించి దీదీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.
కాగా, బెంగాల్ లో ఓట్ చోరీ, ఓట్ల తొలగింపు, ఎస్ఐఆర్ ప్రక్రియపై దీదీ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరు చెప్పి SIR ద్వారా మొత్తం బెంగాల్ ఓటర్లలో 12% (91 లక్షల మంది)ని ఎంపిక చేసి తొలగించారని ఆమె ఆరోపిస్తున్నారు.
టీఎంసీ TMC బలంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఓట్లు తొలగించారని, దాంతోపాటు, చివరి నిమిషంలో 5.25 లక్షల మంది కొత్త ఓటర్లను జోడించారని ఆరోపిస్తున్నారు. బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 93% పోలింగ్ నమోదు కావడం నమ్మశక్యంగా లేదని ఆరోపణలు చేస్తున్నారు.
అయితే, దీదీ ఆరోపణలతో కొందరు రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్ట్ లు ఏకీభవిస్తున్నారను. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ 10% పెరిగిందని, భారీ స్థాయిలో ఫేక్ ఓటింగ్ లేకుండా ఇది సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈసీఐ(ECI) కుట్రతోనే ఇది సాధ్యమైందని, BJP & TMC మధ్య తుది ఓట్ల తేడా కేవలం 34 లక్షలు మాత్రమే అని చెబుతున్నారు. అంతేకాదు, దీదీ ఇలాకా భవానీపూర్ లో 60,000 ఓటర్లను తొలగించారని, ఆమె 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని అంటున్నారు.
టీఎంసీని లక్ష్యంగా చేసుకొని వ్యవస్థాగతంగా ఈ ఓట్లను తొలగించారని చాలా స్వతంత్ర అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి. ఒక ప్యాటర్న్ స్పష్టంగా కనిపిస్తోందని, మనుషులు అబద్ధం చెప్పినా...గణాంకాలు అబద్ధం చెప్పవని అంటున్నారు. బెంగాల్ లో జరిగినవి ఎన్నికలు కాదని, ఇంజనీర్డ్ మానిప్యులేషన్ అని, దేశ ప్రజలు దీనిని గుర్తించి మేల్కోనంత వరకు భారత దేశ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.