కల్వకుంట్ల కవిత(kalvakuntla kavita) కొత్తగా ఏర్పాటు చేసిన 'తెలంగాణ రాష్ట్ర సేన' (టీఆర్ఎస్)(trs) పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టీఆర్ ఎస్ పై బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(teenmar mallanna) చేరారు. టీఆర్ఎస్ ఏర్పాటు వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని మల్లన్న షాకింగ్ ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీని అంతమొందించేందుకే కవిత ఇలా రాజకీయ వ్యూహం పన్నారని ఆరోపించారు. కవిత స్పీచ్ వెనుక రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఉందని అన్నారు. కవిత పార్టీకి నిధులు కూడా రేవంత్ సమకూరుస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్లతో పాటు నాలుగో మంత్రిగా కవిత ప్రమాణ స్వీకారం చేయాల్సిందని ఆరోపణలు చేశారు.
ఆ విషయం నిజమో? కాదో? కవిత తన పిల్లలపై ఒట్టేసి చెప్పాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో చేరి మంత్రి కావాలని కవిత ప్రయత్నించారని, అందుకే కవితను పార్టీ నుంచి కేసీఆర్, కేటీఆర్ సస్పెండ్ చేశారని అన్నారు. ఆ విషయాన్ని 'ఆత్మగౌరవ పోరాటం'గా కవిత చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు.