ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖాతాలో మరో జాతీయ స్థాయి గౌరవం వచ్చి చేరింది. పాలనలో సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధిలో ఆయన చూపుతున్న చొరవకు గుర్తింపుగా 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు వరించింది. ప్రఖ్యాత ఆర్థిక దినపత్రిక 'ఎకనమిక్ టైమ్స్' (ET) ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని చంద్రబాబుకు అందజేయనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి శనివారం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పయనం కానున్నారు.
ఎకనమిక్ టైమ్స్ నిర్వహిస్తున్న 26వ కార్పొరేట్ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ముంబైలో అత్యంత వైభవంగా జరగనుంది. కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు హాజరయ్యే ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్లో చంద్రబాబు(Chandrababu) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. గత దశాబ్ద కాలంగా ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పించడంలో ఆయన చేసిన కృషిని కొనియాడుతూ ఈ అవార్డును ఖరారు చేశారు.
ఈ అవార్డుల ప్రధానోత్సవానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి చేతుల మీదుగానే చంద్రబాబు ఈ అవార్డును అందుకోనుండటం విశేషం. విభజన తర్వాత ఏపీని 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో అగ్రస్థానంలో నిలపడం, ఐటీ, మౌలిక సదుపాయాల కల్పనలో బాబు విజన్ మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
ముంబై(Mumbai) పర్యటనలో భాగంగా చంద్రబాబు పలువురు టాప్ లెవల్ సీఈవోలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్టుబడుల వేటలో ఉన్న ఏపీ సర్కార్కు, ఈ వేదిక ఒక మంచి అవకాశంగా మారనుంది. నేషనల్ మీడియా ఫోకస్ మొత్తం ముంబై ఈవెంట్పైనే ఉండటంతో, ఏపీకి రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.