అత్యంత కీలకమైన అంశాల విషయంలో ఒక రాజకీయ పార్టీ స్టాండ్ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు మధనం జరగటంతో పాటు.. పార్టీ నేతలతో చర్చలు జరిపి.. చివరకు ఒక నిర్ణయాన్ని వెల్లడించటం బాగుంటుంది. అందుకు భిన్నంగా అలాంటిదేమీ లేకుండా పార్టీ అధినేత తన మనసులోని మాటను చెప్పేయటం.. దానికి సంబంధించి జరుగుతున్న ఇమేజ్ డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు వైసీపీ నేతలు పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. తాజాగా ఢిల్లీలో వైసీపీ సీనియర్ నేత కం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(yv subbareddy) చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా చెప్పాలి.
తమ పార్టీ అమరావతి(amaravati)కి వ్యతిరేకం కాదని.. ప్రస్తుతం పెట్టిన బిల్లుకు మాత్రమే తాము వ్యతిరేకమని చెప్పటం విశేషం. నరాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైసీపీ ఎంపీల గొంతు నొక్కారంటూ ఆరోపించిన సుబ్బారెడ్డి.. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ.. అవినీతి జరుగుతోందన్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూ.. ‘‘బిల్లుకు మాత్రమే వ్యతిరేకం. రాజధాని రైతుల వద్ద 50 వేల ఎకరాలు తీసుకున్నారు. 29 వేల మంది రైతులకు న్యాయం చేయమని అడిగాం. అమరావతి రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో బిల్లులో పెట్టమని అడిగాం. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ.. అవినీతి జరుగుతోంది. చదరపు అడుగుకు రూ14వేలు ఖర్చు చేస్తున్నారు.. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ నిర్మాణానికి ఇంత ఖర్చు చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇదంతా చూసినప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని శాశ్వితం చేసేందుకు పార్లమెంటులో పెట్టిన బిల్లు సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. అమరావతి పేరు కాకుండా మావిగన్ పేరును పెట్టాలని సూచన చేయటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు మాత్రమే కాదు.. భారీగా ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. అమరావతి అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తమకు తగిన సమయం ఇవ్వలేదన్న వైవీ సుబ్బారెడ్డి.. నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ గ్యాలరీలో ఉన్న టీడీపీ నేతలను టీవీలో చూపించారన్నారు. ఇలా సంబంధం లేని మాటల్ని చెప్పే కన్నా. .అమరావతి విషయంలో తమ పార్టీ స్టాండ్ ఏంటి? తమ అధినేత ఏం చెప్పాలనుకున్నారు? లాంటి అంశాలపై మరింత కసరత్తు చేస్తే బాగుంటుంది కదా సుబ్బారెడ్డి?