వైసీపీ(ycp) అధినేత జగన్(jagan) ప్రభావం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తోంది. తాను అధికారంలోకి వస్తే.. మళ్లీ రాజధానిపై తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించి.. పార్లమెంటు ద్వారా అమరావతి(amaravati)ని మారుస్తామని ఆయన నేరుగా తనమనసులోని మాటలను బయట పెట్టారు. నిజానికి ఇప్పటికే.. కూటమి నాయకులు జగన్ మరోసారి అధికారంలోకి వస్తే.. ఏం జరుగుతుందో అని పలువురు పారిశ్రామిక వేత్తలు తమను ప్రశ్నిస్తున్నారంటూ.. చెప్పుకొస్తున్నారు.
పరిశ్రమల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు కీలకమైన రాజధాని విషయంలోనూ మరోసారి జగన్ తన మన సులోని మాటను .. అమరావతిపై అక్కసును ప్రదర్శించారు. ఎట్టిప రిస్థితిలోనూ అమరావతిని ఆయన సహించలేక పోతున్నారు. కారణాలు ఏవైనా.. పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని ఆయన ఓర్చుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చట్టబద్ధత పొందినప్పటికీ.. దానిని తాను మార్చేస్తానని.. మళ్లీ అధికారంలోకి వచ్చాక.. సభలో తీర్మానం చేసి.. కేంద్రం ద్వారా మార్పు దిశగా ప్రయాణం చేస్తామన్నారు.
దీంతో ఇప్పుడు మేధావుల నుంచి ఆలోచనాపరుల వరకు .. అందరి దృష్టి రాజ్యాంగంలోని నైన్త్(9)(9th schedule) షెడ్యూల్పైనే ఉంది. రాజధానికి చట్టబద్ధత కల్పిస్తున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం జరిగిన చట్టబద్ధతను.. రాజధాని అమరావతిని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని వారు కోరుతున్నారు. ఇదే జరిగితే.. ఇక, జగన్ చెబుతున్న మరోసారి తీర్మానంతోపాటు.. పార్లమెంటులో మార్పు చేసేందుకు కూడా అవకాశం ఉండదని.. అప్పుడే శాశ్వత రాజధానిగా అమరావతి నిలుస్తుందని అంటున్నారు.
ఏంటీ నైన్త్ షెడ్యూల్..?
రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూస్తుంది. అంతేకాదు.. న్యాయస్థానాల్లో సైతం సవాలు చేయలేని విధంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాల చట్టాల జాబితాను ప్రధానంగా భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ రద్దును రక్షిస్తుంది. భూ సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆస్తి హక్కును నియంత్రిస్తుంది.
9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలకు న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు కల్పిస్తుంది. తద్వారా.. ఈ షెడ్యూల్లో చేర్చిన అంశాలను కోర్టుల్లో సవాల్ చేయడానికి కుదరదు. ప్రస్తుతం సుమారు 284 కంటే ఎక్కువ చట్టాలు ఈ షెడ్యూల్లో ఉన్నాయి. ఈ షెడ్యూల్ భూ సంబంధిత అంశాలను న్యాయపరమైన సవాళ్ల నుండి రక్షించడానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం అమరావతి భూ సమస్యే కాబట్టి.. ఇక్కడి రైతులు.. భూములు ఇచ్చారు కాబట్టి.. భవిష్యత్తులో రాజధానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నైన్త్ షెడ్యూల్ కీలకమని పరిశీలకులు చెబుతున్నారు.
అమరావతి చట్టబద్ధతను దీనిలో చేరిస్తే.. ఇక, జగన్ ఏమీ చేయలేరని అంటున్నారు. దీనిలో చేర్చేందుకు పార్లమెంటులో 2/3 వ వంతు మెజారిటీ అవసరం. ఇప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో దీనిని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.