పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) చివరి చిత్రం ‘ఓజీ’.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగించి గత ఏడాది తెలుగు నుంచి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్లో పవన్ చేసిన సినిమాల్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రం ఇదే. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఫుల్ రన్లో ఆ మూవీ రూ.300 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. కానీ పవన్ ఊపు ఆ ఒక్క సినిమాకే పరిమితం అయింది.
దీని తర్వాత వచ్చిన పవర్ స్టార్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’(ustaad bhagat singh).. ‘ఓజీ’లో మూడో వంతు కలెక్షన్లు(collections) కూడా రాబట్టకపోవడం షాకింగే. ఈ నెల 19న ‘దురంధర్-2’కు పోటీగా బాక్సాఫీస్ బరిలో నిలిచిన వపన్ సినిమా.. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్లో అండర్ పెర్ఫామ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ఆధిపత్యాన్ని చాటలేకపోయింది. వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత చల్లబడిపోయింది.
రెండో వీకెండ్లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా.. అడ్వాంటేజీని ఉపయోగించుకోలేకపోయింది. ఇక రెండో సోమవారం నుంచి ‘ఉస్తాద్’ గురించి డిస్కషనే లేదు. ఆదివారంతోనే ఈ సినిమా రన్ దాదాపు ముగిసిపోయింది. ‘ఉస్తాద్’ ఫుల్ రన్ గ్రాస్ వసూళ్లు రూ.90 కోట్లకు అటు ఇటుగా ఉన్నాయంతే. ‘హరిహర వీరమల్లు’లా డిజాస్టర్ టాక్ తెచ్చుకోకపోయినా.. అభిమానులకు నచ్చే సినిమానే అయినా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ.. ‘దురంధర్-2’ తెలుగు రాష్ట్రాల్లో సైతం ‘ఉస్తాద్’ను గట్టి దెబ్బే తీసింది.
ఇక యుఎస్ లాంటి చోట్ల అయితే ‘దురంధర్-2’ ప్రభంజనానికి పవన్ సినిమా కుదేలైపోయింది. అక్కడ ‘ఓజీ’ ఫుల్ రన్లో 5.6 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబడితే.. అందులో నాలుగో వంతు కలెక్షన్లకు పరిమితమైంది ‘ఉస్తాద్’. దీన్ని బట్టే ‘ఉస్తాద్’ ఎంత పెద్ద డిజాస్టర్ అన్నది అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక అన్ని చోట్లా బయ్యర్లకు దారుణమైన నష్టాలు తప్పలేదు. ‘ఓజీ’తో పోలిస్తే తక్కువ రేట్లకే సినిమాను అమ్మినా.. బయ్యర్లకు గట్టి దెబ్బ తప్పలేదు.