ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారారు. ఎన్డీయే కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి బీజేపీ అధిష్టానం నుంచి కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు తండ్రీకొడుకులకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది.
మమతా కోటలో బాబు మార్క్ రాజకీయం
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అక్కడ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)ని ఢీకొట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఒకప్పుడు మమతకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా, జాతీయ రాజకీయాల్లో ఆమెకు వెన్నుదన్నుగా నిలిచిన చంద్రబాబుకు ఇప్పుడు అదే బెంగాల్ బాధ్యతలు ఇవ్వడం విశేషం. బెంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు, బాబుకున్న జాతీయ స్థాయి ఇమేజ్ను వాడుకుని తృణమూల్ కాంగ్రెస్కు చెక్ పెట్టాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. మిత్రురాలి కోటలోనే ఆమెకు వ్యతిరేకంగా బాబు ప్రచారం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అస్సాంలో లోకేష్ ‘యువ’ గళం
ఇక ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్(Nara Lokesh)కు అస్సాం బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అస్సాంలో యువ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. గతంలో బీహార్ ఎన్నికల సమయంలో లోకేష్ తన ప్రసంగాలతో యువతను ఆకట్టుకోవడంలో సఫలమయ్యారు. అదే ఫార్ములాను ఇప్పుడు అస్సాంలో కూడా ప్రయోగించాలని ఎన్డీయే భావిస్తోంది. లోకేష్ తనదైన స్టైల్లో అభివృద్ధి, ఉపాధి అంశాలను ప్రస్తావిస్తూ అక్కడ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కేలా పావులు కదుపుతున్నారు.
వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న మమతను గద్దె దించాలని బీజేపీ(BJP) పట్టుదలతో ఉంది. అందుకే ఇతర రాష్ట్రాల్లోని బలమైన మిత్రపక్ష నాయకులను రంగంలోకి దింపి ఎన్నికల వాతావరణాన్ని మార్చేయాలని చూస్తోంది. చంద్రబాబు అనుభవం, లోకేష్ దూకుడు కలిస్తే బెంగాల్, అస్సాంలలో ఎన్డీయేకు కొత్త ఊపు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు మూడు రోజుల పాటు సాగే ఈ ప్రచార పర్వం.. ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.