వైసీపీ అధినేత జగన్ మాతృమూర్తి విజయమ్మ తాజాగా శుక్రవారం సాయంత్రం ఓపెన్ లెటర్ రాశారు. దీనినే అడ్వొకేట్ ద్వారా నోటరీ చేయించి.. విడుదల చేయించారు. అంటే.. దీనిని పూర్తి సాక్ష్యంగా అటు చట్టబద్ధంగా.. ఇటు న్యాయ బద్ధంగా పేర్కొన్నట్టు అయింది. ఇక, ఈ లేఖలో విజయమ్మ ఆస్తుల గురించే ప్రస్తావించారు. జగన్ .. తన సోదరి షర్మిల, ఆమె పిల్లలకు అన్యాయం చేశాడని పేర్కొన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు జగన్ ఏదైనా ఇచ్చి ఉన్నా.. అది కేవలం డివిడెండ్(కొసరు) మాత్రమేనని.. అసలు ఇంకా తేల్చలేదని.. తెలిపారు.
``వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి రాసుకుంటున్న విన్నపం.. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగ లేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలు(జగన్+ షర్మిల బిడ్డలకు)కు సమానంగా పంచాలని వైఎస్సార్ ఉద్దేశ్యం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమిది. MOUలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ MOU రాశాడు.
నిజానికి షర్మిలకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్ తో సహా MOUలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇక, ఇప్పటికే ఎంతో ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం అనేది ఇప్పటి వరకు జరగ లేదు.
ఇప్పుడు చెందుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్సార్ జగన్కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు ?.(వైసీపీ నాయకులు) మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయo. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే.