టాలీవుడ్ అందాల నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) సోషల్ మీడియా వేదికగా ఎదురవుతున్న వేధింపులపై గట్టి నిర్ణయం తీసుకున్నారు. తన పట్ల, తన కుటుంబం పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారిపై చట్టపరమైన పోరాటానికి దిగారు. గత కొద్ది రోజులుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను అరికట్టేందుకు ఆమె నేరుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
లావణ్య తన ఫిర్యాదులో ‘పర్పుల్ క్రేయాన్(Purple Crayon00)’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రధానంగా పేర్కొన్నారు. సదరు అకౌంట్ నిర్వాహకులు నిరంతరం తనను దూషిస్తూ, అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని ఆమె పోలీసులకు వివరించారు. కేవలం తన వృత్తిపరమైన విషయాలే కాకుండా, తన వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు చేస్తున్నారని, ఇది తన పరువుకు భంగం కలిగించేలా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
లావణ్య త్రిపాఠి ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు, కొత్తగా అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ (BNS) 78, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సదరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎక్కడి నుండి ఈ పోస్టులు చేస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ వివాదాస్పద అకౌంట్లోని అసభ్యకర పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టనున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం సహజమే అయినా, అవి వ్యక్తిగత దూషణలు మరియు కుటుంబ సభ్యుల వరకు వెళ్లడంపై లావణ్య తీవ్రంగా స్పందించారు. ఈ కేసు ద్వారా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్లు చేసే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లయింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.