మధ్యప్రాచ్యం (Middle East) ఒక అగ్నిపర్వతంలా మారింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మెరుపు దాడిలో హతమయ్యారన్న వార్తతో ప్రపంచ దేశాలన్నీ ఉపిరి బిగబట్టుకున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఇరాన్ వ్యూహాలకు కేంద్రబిందువుగా ఉన్న ఖమేనీ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు.. అది ఒక వ్యవస్థకు తగిలిన అతిపెద్ద దెబ్బ. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒక్కటే.. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అసలు భారత్ పరిస్థితి ఏంటి?
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రగిలిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా భయంకరమైన ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ విప్లవ దళాలు (IRGC) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని హౌతీ రెబల్స్ ఒక్కసారిగా విరుచుకుపడితే మధ్యప్రాచ్యం మొత్తం యుద్ధ క్షేత్రంగా మారడం ఖాయం. అగ్రరాజ్యం అమెరికా కూడా తన నౌకాదళాన్ని సిద్ధం చేయడంతో, ప్రపంచం ఒక భారీ యుద్ధం ముంగిట నిలబడినట్లు కనిపిస్తోంది.
భారత్పై పడే ప్రభావం: పెరగనున్న పెట్రోల్ మంటలు!
ఈ పరిణామాలు భారత్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. భారత్(india) తన అవసరాల కోసం అత్యధికంగా ముడి చమురును గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోతే, భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అలాగే ఇరాన్, పరిసర గల్ఫ్ దేశాలలో దాదాపు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. యుద్ధం తీవ్రతరమైతే వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం భారత ప్రభుత్వానికి హిమాలయాల వంటి సవాలుగా మారుతుంది.
మరోవైపు భారత్ వేల కోట్లు వెచ్చించి ఇరాన్లో నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవు ఇప్పుడు ప్రమాదంలో పడింది. మధ్య ఆసియా దేశాలకు భారత్ చేరుకోవడానికి ఇది చాలా కీలకం. ఖమేనీ(Khamenei) మరణం తర్వాత ఇరాన్లో ఏర్పడే రాజకీయ అనిశ్చితి వల్ల ఈ ప్రాజెక్ట్ నిలిచిపోతే, భారత్ వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ తింటుంది. అటు అమెరికాతో స్నేహం, ఇటు ఇరాన్తో అవసరం.. ఈ రెండింటి మధ్య భారత్ ఇప్పుడు కత్తి మీద సాము చేస్తోంది.