ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం ఒక పెను తుఫానులా మారింది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఆధారాలతో సహా చార్జ్ షీట్ వివరాలను బయటపెట్టడంతో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడిపోయినట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడే వైసీపీ ఫైర్ బ్రాండ్లు, ఈ నెయ్యి కల్తీ విషయంలో మాత్రం గొంతు సవరించుకోలేకపోతున్నారు. హెరిటేజ్ సంస్థను ఈ వివాదంలోకి లాగి కౌంటర్ ఇవ్వాలని చూసినా, అది ప్రజల్లోకి వెళ్లకపోగా రివర్స్ ఫైర్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ వ్యూహం పూర్తిగా మారిపోయిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రస్తుతం వైసీపీ(YCP) కేడర్ అంతా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు, ఆయన పరామర్శల చుట్టూనే తిరుగుతోంది. నెయ్యి కల్తీ వల్ల జరిగిన డ్యామేజ్ను కవర్ చేయడానికి కాపు సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. అంబటి రాంబాబును కాపు టైగర్ గా చిత్రీకరిస్తూ, ఆయన అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా మలచాలని ఆ పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది. అయితే, అసలు సిసలైన నెయ్యి కల్తీ ఆరోపణలపై మాత్రం వైసీపీ నేతలు మౌనం వహించడం వెనుక ఏదో బలమైన భయం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎక్కడ మాట్లాడితే మరిన్ని ఆధారాలు బయటపడతాయోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
మరోవైపు, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో తేలిన అంశాలు, క్షేత్రస్థాయిలో వెలుస్తున్న ఫ్లెక్సీలు వైసీపీకి ఊపిరి సలపనీయడం లేదు. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, ప్రజల సెంటిమెంట్ను బలంగా పట్టుకుంది. ఈ క్రమంలో వైసీపీ ఎదురుదాడి చేయలేక, కేవలం అరెస్టులు-పరామర్శలకే పరిమితం అవ్వడం ఆ పార్టీ బలహీనతను సూచిస్తోంది. నెయ్యి కల్తీ వంటి సున్నితమైన అంశంపై సరైన వివరణ ఇవ్వకుండా, ఇతర రాజకీయ అంశాలతో పక్కదారి పట్టించాలని చూడటం ప్రజల్లో అనుమానాలను మరింత రెట్టింపు చేస్తోంది.