వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. విచారణ కోర్టు(తెలంగాణ హైకోర్టు) గతంలో ఇచ్చిన ఆదేశాల వరకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ కోర్టు.. పరిధిని తక్కువ చేసిందని.. మరింత మందిని విచారించాల్సి ఉందని ఆమె కోరారు.
తాజాగా జరిగిన విచారణలో సుప్రీంకోర్టు.. సునీత వాదనలను పక్కన పెట్టినట్టు కనిపించింది. మరింత ఎక్కువ మందిని విచారించేలా సీబీఐని ఆదిశించాలని కోరుతూ.. సునీత ఈ పిటిషన్ను వేశారు. అయితే.. దీనిలో అవసరం ఉంటే సీబీఐ ఆ పనిచేస్తుందని.. తాము ట్రయల్ కోర్టు విచారణ పరిధిలోకి వెళ్లబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే.. సీబీఐ తన స్వంత్రతను కాపాడుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు సీబీఐ విచారించాలని.. పేర్కొన్న సుప్రీంకోర్టు.. మరింత సమయం ఇస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఏంజరిగింది?
వివేకానందరెడ్డి హత్య కేసు విషయాన్ని తెల్లవారుజామున.. కడప నుంచి హైదరాబాద్లో ఉన్న జగన్కు ఫోన్చేసి కొందరు చెప్పారు. ఇదేసమయంలో భారతికి కూడా ఫోన్లు వెళ్లాయి. ఇలా వారికి తొలి ఫోన్లు ఎందు కు వెళ్లాయి? అనే అంశాన్ని తేల్చాలని.. కోరుతూ సునీత ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదేసమయంలో మరింత మందిని విచారించకుండానే సీబీఐ ఈ కేసును ముగించిందని.. అలా కాకుండా.. తమకు అనుమానం ఉన్న అందరినీ విచారించాలని కూడాకోరారు.
దీనిపై విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు.. జగన్, భారతిలను విచారించాలన్న.. సునీత అభ్యర్థనను పక్కన పెట్టింది. అదేవిధంగా వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలన్న సునీత వినతిని పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ.. సుప్రీంకోర్టు కూడా ట్రయల్ కోర్టు విచారణ పరిధిలోకి జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేయడం గమనార్హం. దీంతో వివేకా కేసు కొన్ని పరిమితుల వరకే పరిమితి కానుందని న్యాయవాదులు తెలిపారు.