తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూలో కల్తీనెయ్యి కలిపారన్న వ్యవహారంపై ప్రజల్లోకి వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. తాజాగా నిర్వహించిన కూటమి పార్టీల అధినేత ప్రధాన సమావేశంలో ఈ వ్యవహారంపై ఒక నిర్ణయానికి వచ్చారు. పక్కా పవర్ పుల్గా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. వైసీపీ ప్రచారాన్ని ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు.
శ్రీవారి లడ్డూ తయారీలో వైసీపీ హయాంలో భారీ కుంభకోణం జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వైసీపీకి సీబీఐ ఇచ్చిన నివేదికలో ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.
దోషులను వదిలి పెట్టేది లేదన్న పవన్ కల్యాణ్.. వారిని ప్రజల ముందు మోకరిల్లేలా చేస్తామని చెప్పడం ద్వారా పక్కా ప్రణాళికను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నెయ్యి కల్తీ వ్యవహారాన్ని ఆధారాలతో సహా ప్రజలకు వివరించడం ద్వారా.. పవిత్ర తిరుమలను ఎలా భ్రష్టు పట్టించారో కూడా వివరించనున్నారు. ఈ వ్యవహారంపై గతంలోతాము మాట్లాడేటప్పుడు కొన్ని పరిణామాలను ఎదుర్కొన్నామని చెప్పిన పవన్.. ఈ దఫా పక్కా ఆధారాలతోనే ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమయ్యామని చెప్పారు.
ముఖ్యంగా ఎంత మేరకు వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా అయింది.. దానిలో ఎంత మేరకు కల్తీ జరిగింది? అసలు అది నెయ్యి కాదనే నివేదికను సీబీఐ ఇచ్చిన వ్యవహారాన్ని కూడా ప్రజలకు వివరించనున్నారు. త్రిముఖ వ్యూహంతో మూడు పార్టీలు కూడా ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించుకున్న దరిమిలా.. దీని నుంచి వైసీపీ తప్పించుకోని విధంగా కూటమి ప్రజల మధ్యకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయనుందని తెలుస్తోంది.