వంశీ అరెస్ట్‌పై జ‌గ‌న్ ఫ‌స్ట్ రియాక్ష‌న్‌..!

admin
Published by Admin — February 14, 2025 in Politics, Andhra
News Image

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఏపీ రాజ‌కీయాల‌ను వేడిక్కించింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీ.. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ను ఏకంగా కిడ్నాప్ చేసి బెదిరించి దగ్గరుండి కేస్ విత్ డ్రా చేయించారు. ఈ వ్య‌వ‌హార‌మే వంశీని చిక్కుల్లో ప‌డేసింది. కేస్ విత్ డ్రా చేసుకున్న సత్యవర్ధన్ తిరిగి వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో పోలీసులు ఆయ‌న్ను నిన్న అదుపులోకి తీసుకున్నారు. వంశీ అరెస్ట్ త‌ర్వాత వైసీపీ హ‌యాంలో ఆయ‌న చేసిన అక్ర‌మాల‌న్ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

మ‌రోవైపు వంశీ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ వైసీపీ కూట‌మి స‌ర్కార్ పై నిప్పులు చెరుగుతోంది. వీట‌న్నిటినీ తాపీగా చూస్తున్న జ‌గ‌న్ ఎట్ట‌కేల‌కు వంశీ అరెస్ట్ పై రియాక్ట్ అవుతూ ఎక్స్ వేదిక‌గా సుధీర్గ పోస్ట్ పెట్టారు. `రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్ర‌బాబు కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారు.` అంటూ జ‌గ‌న్ మండిప‌డ్డారు.

`సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిగారిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్న‌ది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.` జ‌గ‌న్ అన్నారు.

అలాగే `దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా?

చంద్రబాబుగారూ! ప్రజలకు ఇచ్చిన సూపర్‌-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మాపార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులుతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం.` అంటూ జ‌గ‌న్ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.

Tags
Andhra Pradesh AP News ap politics
Recent Comments
Leave a Comment

Related News