వేదిక ఏదైనా.. విషయం ఎలాంటిదైనా.. టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్(lokesh) వేసే పంచ్లు జోరుగా పేలుతున్నాయి. గతంలోను.. ఇప్పుడు కూడా ప్రత్యర్థులపై నారా లోకేష్ బలమైన పంచ్ డైలాగులతో విరుచుకుపడుతున్నారు. ఈ పంచ్ డైలాగు లు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇక, టీడీపీ శ్రేణులకు ఇవి నోటి మాటలుగా మారుతున్నాయి. వైసీపీ పార్టీకి ఇటీవల సీఎం చంద్రబాబు `గొడ్డలి పార్టీ`(goddali party) అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇది జోరుగా శ్రేణుల్లోకి చేరిపోయింది.
దీనికి ముందు `రప్పా.. రప్పా.. పార్టీ` అంటూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. ఇలా.. కొన్ని కొన్ని వ్యాఖ్యలు, నినాదాలు.. పదాలు కార్యకర్తలు వెంటనే అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా మంత్రి లోకేష్(lokesh) ఇలాంటి వ్యాఖ్యే చేశారు. ఇది కార్యకర్తల్లోనూ.. టీడీపీ శ్రేణుల్లోనూ బలంగా దూసుకుపోయింది. విశాఖలో నిర్వహించిన గూగుల్ డేటా కేంద్రం భూమి పూజ కార్యక్రమంలో మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గూగుల్ రాక పూర్వాపరాలను వెల్లడించారు. ఇదేసమయంలో దీనిని అడ్డుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు కూడా వివరించారు.
అనంతరం.. విశాఖలో పార్టీ కార్యకర్తలతోనూ నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమయంలో మరోసారి గూగుల్ డేటా కేంద్రం ప్రత్యేకత వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ‘లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్ వేరు అని పవనన్న డైలాగ్ ఉంది. మనది గూగుల్(google)... వైసీపీ వాళ్లది గొడ్డలి. `` అని వ్యాఖ్యానించారు.గూగుల్ వస్తే ఎవరైనా ఆహ్వానించాలని పేర్కొన్నారు. కానీ.. `గొడ్డలి పార్టీ` మాత్రం వ్యతిరేకించిందన్నారు. వైసీపీ ఎంపీ(తిరుపతి) గూగుల్ వద్దని పిల్ వేశారని పేర్కొన్నారు. వాళ్లకి ఎలాగూ ఇలాంటివి తీసుకురావడం చేత కాదని.. వేరేవాళ్లు తెస్తే ఏడుస్తారని అన్నారు.
ఈ క్రమంలోనే నారా లోకేష్... మాది “గూగుల్” అయితే, మీది “గొడ్డలి”.. బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్..`` అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కామెంట్లను ప్రచారంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రీల్స్లోనూ ఇది ట్రెండింగులో ఉండడం విశేషం. గతంలోనూ లోకేష్..జగన్ను సైకో అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఆ నినాదం బాగా పనిచేసిందని టీడీపీ భావించింది.