ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి(జూన్ 4) ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యాన్ని పురస్కరిం చుకుని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాతీర్పుకు ఏడాది పూర్త యిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు.. కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు అని సోషల్ మీడియా ఎక్స్లో చంద్రబాబు పేర్కొన్నారు.
నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ``జూన్ 4.. ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో పాలనకు అంతం పలికి.. ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు.`` అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజుగాచంద్రబాబు హర్ష్ం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజుగా పేర్కొన్నారు. ``పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు`` అని చంద్రబాబు తెలిపారు. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నామని తెలిపారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షల నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి.. సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు చెబుతున్నానని చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు.