జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి సింగపూర్ నుంచి ఇండియాకు చేరుకున్నారు. ఏప్రిల్ 8న సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. మంటలు చెలరేగడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైన మార్క్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
రెండు రోజులు ట్రీట్మెంట్ అనంతరం డిశ్చార్జ్ అయిన మార్క్.. ప్రస్తుతం కోలుకుంటున్నారు. కుమారుడు గాయపడిన విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. ప్రమాదం నుంచి మార్క్ శంకర్ కాస్త కోలుకోవడంతో అతడితో కలిసి పవన్ కళ్యాణ్ ఇండియాకు పయనమయ్యారు.
శనివారం రాత్రి 11 గంటల సమయంలో పవన్ తన సతీమణి అన్నా లెజినోవా, కొడుకు మార్క్ శంకర్, కూతురు పోలేనా అంజనతో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఇకపై మార్క్ హైదరాబాద్ లోనే ఉండబోతున్నాడని.. అతని స్కూలింగ్ ఇక్కడే సాగబోతుందని తెలుస్తోంది. సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్ల తనయుడి బాధ్యతలను అన్న చిరంజీవి, వదిన సురేఖకు అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.