తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలపై గట్టిగా సెటైర్లు పేల్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ సుధీర్గ ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
పేదరికం లేని సమాజమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్నారు. కార్యకర్తే పార్టీ అధినేత అన్నారు. కార్యకర్తల కోసం తాను బయట ఎంత పోరాడతానో పార్టీలో కూడా అంతే పోరాడతానని లోకేష్ పేర్కొన్నారు. అలాగే పార్టీ మరో నలభై ఏళ్లు బ్రతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలని.. యువకులు రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. సీనియర్లను గౌరవిస్తా.. పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా.. అదే నా స్టైల్ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇక ఈ క్రమంలోనే పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్ధేశించి లోకేష్ సెటైర్లు పేల్చారు. `ఈ మధ్య ఎక్కడికి వెళ్లిన రెబ్ బుక్ గురించి డిస్కష్స్ జరుగుతున్నాయి. నిజానికి నేను రెబ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, రెడ్ బుక్ పేరు వింటే చాలు కొంత మందికి గుండెపోటు వస్తుంది. కొంతమంది బాత్రూంలో కాలు జారి చేతులు విరగొట్టుకుంటున్నారు. అర్థమైందా రాజా.. అర్థమైందా రాజా..` అంటూ ఇన్డైరెక్ట్ గా కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జరిగిన సంఘటలను మంత్రి లోకేష్ గుర్తు చూస్తూ పంచ్లు వేశారు.
కాగా, గత కొద్ది రోజుల నుంచి వైసీపీ నేతల అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. అయితే లిస్ట్ లో నెక్స్ట్ ఉన్నది కొడాలి నాని అంటూ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో కొడాలి నానికి గుండె పోటు అనే వార్త తెరపైకి వచ్చింది. నిజంగా ఆయనకు గుండె పోటు రాలేదు. గ్యాస్ట్రిక్ సమస్యతో మూడు రోజుల క్రితం హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. కొన్ని పరీక్షల అనంతరం గుండె సంబంధిత సమస్య కూడా ఉందని వైద్యులు గుర్తించారు. మరోవైపు లిక్కర్ స్కాంలో అడ్డంగా ఇరుక్కున్న సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బాత్ రూమ్ లో కాలు జారి పడ్డారు. ఆయన కుడిచేయి ఎముక చిట్లిడంతో.. వైద్యులు సర్జరీ చేశారు. కొడాలి, పెద్దిరెడ్డి ఇలా ఒకేసారి హాస్పిటల్ లో చేరడంతో.. కేసులు, అరెస్ట్ల భయంతో వైసీపీ నేతలు అనారోగ్యం డ్రామాలు ఆడుతున్నారంటూ ప్రత్యర్థ పార్టీల అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు.