వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పైలట్ గా మారారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటూ సొంతంగా ప్రైవేట్ జెట్ నడిపి అందర్ని ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో కేతిరెడ్డి ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైసీపీ హయాంలో `గుడ్ మార్నింగ్ ధర్మవరం` కార్యక్రమంతో వార్తల్లో ట్రెండ్ అయిన కేతిరెడ్డి.. కూటమి అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలకు పాల్పడిన వ్యవహారంలో హైలెట్ అయ్యారు.
ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా కేతిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో కేతిరెడ్డి పైలట్ గా దర్శనమిచ్చారు. ఓ మినీ ప్రైవేట్ జెట్ విమానాన్ని నడుపుతూ హైదరాబాద్ గగన వీధుల్లో విహరించారు. `కలల నుండి వాస్తవికత వరకు – అధికారికంగా పైలట్ అయ్యాను! ఆకాశం ఇకపై పరిమితి కాదు. ప్రతి సవాల్ కు, ప్రతి పాఠంకు ఇది ప్రారంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇక ముందు మరిన్ని అంతులేని సాహసాలు ఉన్నాయి. ఒంటరిగా ఇదే నా తొలి గగన విహారం… అందుకు మద్దతు ఇచ్చిన వింగ్స్ టీమ్ కు కృతజ్ఞతలు` అంటూ కేతిరెడ్డి ట్వీట్ చేశారు.
ప్రస్తుతం కేతిరెడ్డి ప్రైవేట్ జెట్ ను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, 2024 ఎన్నికల్లో కూటమి గాలికి కొట్టుకుపోయిన నేతల్లో కేతిరెడ్డి ఒకరు. గుడ్ మార్నింగ్ అంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ధర్మవరం నియోజకవర్గం మొత్తం కలిగియదిరిగిన.. చివరకు ఓటమే ఆయనకు ఎదురైంది. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో కనుమరుగైన కేతిరెడ్డి.. హైదరాబాద్ లో రిలాక్స్ అవుతున్నారు.