జ‌గ‌న్ గొప్ప‌గా చెప్పారు కానీ.. అంతా డొల్లేనా ..!

admin
Published by Admin — April 22, 2025 in Politics, Andhra
News Image

కొన్ని కొన్ని విషయాలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ వాటిలో ఎంత డొల్లతనం ఉందనేది తర్వాత కానీ అర్థం కాదు. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌ చెప్పిన విషయాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రాంతీయ ఇన్చార్జిలుగా కొంతమందికి వైసిపి అధినేత జ‌గ‌న్ కొన్నాళ్ల కిందటే అవకాశం కల్పించారు. వారు పార్టీ నాయకులను లైన్లో పెడతారని పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారని కూడా అప్పట్లో చర్చ నడిచింది.

బొత్స‌ సత్యనారాయణ, కురసాల కన్నబాబు లాంటి సీనియర్ నాయకులు ప్రాంతీయ ఇన్చార్జిలుగా నియమించారు. కానీ త‌ర్వాత‌ పరిణామాలను గమనిస్తే వారు ఎక్కడా సమర్థవంతంగా పనిచేయటం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవ‌ల విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారిపోయింది. దీని వెనక కన్నబాబు ఎంత సమర్థవంతంగా పనిచేశారు అనేది అర్థమవుతుంది అని వైసిపి నాయకులు చెప్పుకుంటున్నారు. దీనికి తోడు అంతర్గత వ్య‌వ‌హారాలు కూడా పార్టీకి నష్టపరుస్తున్నాయి.

సీనియర్ నాయకులను వదిలేసి పార్టీలో ఎప్పటి నుంచైనా నాయకులను పక్కనపెట్టి మధ్యలో వచ్చిన వారికి అవకాశం కల్పించడం ఏమిటి అనేది పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తాజాగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)ని నియమించారు ఇందులో కూడా సీనియర్ నాయకులను చాలామందిని పక్కన పెట్టారనేది చర్చగా మారింది. కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు కల్పించార‌ని ప్రజల్లో పెద్దగా బలం లేని బలం కోల్పోయిన వారిని కూడా తీసుకున్నారు అని చెబుతున్నారు.

ఇలాంటి వారిలో ముద్రగడ పద్మనాభం పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. ఆయనకు ఇప్పుడు పట్టులేదని ప్రజల్లో ఆయన ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారని కూడా నాయకులు చెబుతున్నారు. దీనిని బట్టి గొప్పగా చెబుతున్న ఏ కమిటీ కూడా వైసీపీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కల్పించడం లేదని నాయకులు భావిస్తున్నారు. దీనిపై జగన్ ఆత్మ విమర్శ చేసుకుంటారో.. త‌న‌ను తాను మార్చుకుంటారో లేదో చూడాలని సీనియ‌ర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags
Andhra Pradesh AP News ap politics
Recent Comments
Leave a Comment

Related News