ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. చిత్తూరు జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకునే నడివీధి గంగమ్మ జాతర ఉత్సవాలు చివరిరోజుకు చేరుకున్న నేపథ్యంలో బుధవారం విశ్వరూప దర్శనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు.. కుటుంబ సమేతంగా ఈ జాతరలో పాల్గొన్నారు. గంగమ్మ విశ్వరూప దర్శనంలో అమ్మవారిని చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ బద్ధంగా పట్టు వస్త్రాల ను వెండి పళ్లెంలో పెట్టుకుని.. తలకు పాగా ధరించి.. అమ్మవారికి ఆ వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నడివీధి గంగమ్మ ఆలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. చంద్రబాబు పూర్వీకులు కూడా.. ఈ అమ్మవారికి పూజలు చేశారు. ఈ క్రమంలో నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
యోగాపై మీడియాతో..
బుధవారం ఉదయం గుంటూరులోని ఉండవల్లిలో ఉన్న తన నివాసంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి భారత దేశం యోగాను బహుమానంగా ఇచ్చిందని తెలిపారు. వచ్చే నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో `యోగాంధ్ర` పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని చంద్రబాబు పేర్కొన్నారు. యోగా అనేది కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదని.. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమని పేర్కొన్నారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా ‘యోగాంధ్ర’ వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు.