ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గత వైసీపీ పాలనలో జగన్ కంట్లో నలుసులా మారారన్నది జగమెరిగిన సత్యం. వైసీపీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ.. ఆరు నెలలు తిరక్క ముందే ఆ పార్టీ అధినేత జగన్ కి ఎదురుతిరిగారు. నాలుగేళ్ల పాటు వైసీపీ ముఖ్య నేతలతో, జగన్ తో యుద్ధం చేసిన రాఘురామ.. చివరకు టీడీపీలో చేరి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే జగన్, రాఘురామ మధ్య వైరం ఎక్కడ మొదలైంది అన్న విషయం మాత్రం ఎవరికీ పూర్తిగా తెలియలేదు.
తాజాగా ఈ సీక్రెట్ ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రివీల్ చేశారు. కృష్ణా జిల్లాలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ నాయకులకే కాదు సొంత పార్టీ నాయకులకూ చుక్కలు చూపించారని మండిపడ్డారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు నాడు ఎంపీగా ఉన్న సమయంలో జగన్ను సార్ అనలేదని, పైగా ఆయన ముందు కాలిపై కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారనే కారణాలతో జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారంటూ మంత్రి సుభాష్ చెప్పుకొచ్చారు.
అలాగే తనకు 2024 ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కబురు పంపారని.. సరే అని మిథున్రెడ్డిని కలిశాక ధనుంజయరెడ్డి దగ్గరకు వెళ్లగా జగన్కు సాష్టాంగ నమస్కారం చేయాలని ఆయన సూచించారని.. దాంతో తాను కంగుతిన్నానని మంత్రి సుభాష్ నాటిరోజులను గుర్తు చేసుకున్నారు. డార్క్రూమ్లో కూర్చొని నలుగురితోనే జగన్ వ్యవస్థలను నడిపించేవారని.. ఆయన తీరుతో సొంత పార్టీ నేతలే విసుగు చెందారని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మళ్లీ తానే సీఎం అవుతానని జగన్ బలంగా నమ్మారని.. కానీ ఎన్నికల్లో ఫలితాలు తారామురు కావడంతో ఏం చేయలేక కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం షురూ చేశారని మంత్రి ఆరోపించారు.