టీడీపీ తరపున విజయనగరం నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా లోక్సభకు ఎన్నికైన కలిశెట్టి అప్పలనాయుడు శైలి అందరికన్నా చాలా భిన్నం. చంద్రబాబుకు విరాభిమాని అయిన కలిశెట్టి.. తన నాయకత్వ లక్షణాలతో ఆయన్నే మెప్పించారు. సాధారణ నాయకుడి నుంచి రాజసభ్య సభ్యుడిగా ఎదిగారు. సైకిల్ పై పార్లమెంట్ సమావేశాలు వెళ్లి తన ప్రత్యేకత చాటుకున్నారు. తాజాగా విజయనగరం పార్లమెంట్ పరిధిలో సొంతంగా ఈ వినూత్న పథకాన్ని అమల్లోకి తెచ్చి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఓ ప్రకటన చేశారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో మూడో సంతానంగా ఆడ బిడ్డ జన్మిస్తే వెంటనే అమ్మాయి పేరిట రూ.50వేలు డిపాజిట్ చేస్తానని.. అదే మగ బిడ్డ పుడితే ఆవు, దూడ బహుమతిగా అందజేస్తానని కలిశెట్టి హామీ ఇచ్చారు. తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా పెరగాలంటూ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఎంపీ కలిశెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడితోనే ఆగిపోకుండా తాజాగా ఇచ్చిన హామీని కలిశెట్టి నిలబెట్టుకున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాడ వెంకటలక్ష్మి అనే మహిళకు మూడో సంతానంగా ఆడ పిల్ల జన్మించడంతో.. శ్రీ నిఖిల నాయుడు కలిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ బాలింతకు రూ. 50 వేల చెక్కును అందజేశారు.
అలాగే లావేరు మండలం కొత్త కుంకుమ గ్రామానికి చెందిన కుప్పిలి నాగమణి అనే మహిళకు మూడో సంతానంగా మగబిడ్డ జన్మించడంతో.. ఆమెకు ఆవుదూడను బహుబతిగా అందించారు. భోగాపురం మండలం సవరపల్లిలో మూడు సంతానంగా ఆడపిల్లకు జన్మనిచ్చిన పోలిపల్లి సురేష్, దివ్య దంపతులకు రూ. 50 వేల చెక్కును ఎంపీ కలిశెట్టి అందజేశారు. ఈ వినూత్య కార్యక్రమం ప్రస్తుతం విసృతంగా వైరల్ అవ్వడంతో.. శభాష్ కలిశెట్టి అంటూ పలువురు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.