విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) రాజకీయ సన్యాసంపై రూటు మార్చనున్నారా..? మళ్లీ సొంత గూటికే చేరబోతున్నారా..? అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా రెండుసార్లు విజయం సాధించిన కేశినేని నాని పార్టీకి విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ, సోదరుడు చిన్నితో విభేదాలు, సొంత పార్టీలోనే ప్రత్యర్థులు పెరిగిపోవడం.. వారికి హై కమాండ్ మద్ధతు ఇవ్వడంతో కేశినేని నాని జీర్ణయించుకోలేకపోయారు.
నారా లోకేష్ విజయవాడలో కేశినేని చిన్నిని ప్రోత్సహించడంతో కేశినేని నాని టీడీపీని వీడి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాని.. సోదరుడు చిన్ని చేతుల్లోనే ఓడిపోయారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురై గత ఏడాది జూన్ లో వైసీపీకి గుడ్ బై చెప్పేయడమే కాకుండా రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
ఇక గత కొద్ది రోజుల నుంచి కేశినేని నాని టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వేళ నాని పెట్టిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 20న టీడీపీ అధినేత, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ చెబుతూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
`చంద్రబాబు నాయుడు గారికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ మైలురాయి ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని మరియు దశాబ్దాల రాజకీయ నాయకత్వం, పాలన మరియు ప్రజా సేవను సూచిస్తుంది. మీ ఈ ప్రయాణంలో భాగం అయ్యే అవకాశం నాకు లభించింది. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీకు మంచి ఆరోగ్యం, నిరంతర బలం మరియు ప్రజా జీవితంలో, సేవలో మరిన్ని చురుకైన సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను.` అంటూ నాని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కేశినేని నాని అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయని జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.