చంద్రబాబు, భువనేశ్వరి ఢిల్లీ టూర్..మోదీకి ఆహ్వానం

admin
Published by Admin — April 24, 2025 in Politics
News Image

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మే 2న ఏపీ రాజధాని అమరావతి రీ లాంచ్ పనులు మోదీ ప్రారంభించనున్నారు. ఐదేళ్లుగా జగన్ సర్కార్ విస్మరించడంతో అడవిగా మారిన అమరావతికి జీవం పోసేందుకు చంద్రబాబు, మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మోదీ ఏపీ టూర్ కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో, మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా ఢిల్లీ వెళుతున్నారు. అంతేకాదు, సతీమణి భువనేశ్వరితో పాటు కలిసి వెళ్లి మోదీని అమరావతికి రమ్మని చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

చంద్రబాబు దంపతులు రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మే 2వ తేదీన అమరావతిలో నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, పనులకు శంకుస్థాపన చేయాల్సిందిగా మోదీని చంద్రబాబు కోరనున్నారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టాలని చంద్రబాబు కోరబోతున్నారు.

కాగా, మోదీ అమరావతి టూర్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోదీ అమరావతి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయబోతున్న బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా. జాతీయ రహదారికి అనుసంధానంగా 8 రోడ్లను, వాహనాల పార్కింగ్ కోసం 11 విశాలమైన ప్రదేశాలను గుర్తించారు. సభా ప్రాంగణంలో మొత్తం 3 వేదికలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన వేదికతో పాటు మరో వేదికపై రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, మహిళలు, రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులు ఉంటారు. మరో వేదికపై మంత్రులు, కీలక నేతలు ఉండే చాన్స్ ఉంది.

హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు సుమారు 1.1 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. మోదీతో చంద్రబాబు భేటీ తర్వాత పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడయ్యే అవకాశముంది.

Recent Comments
Leave a Comment

Related News